హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీకి ఈటల రాజేందర్ బ్రోకర్గా మారాడని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఈటల రాజేందర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్పై ఈటల చేసిన అనుచిత వ్యాఖ్యలను బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. అచ్చంపేట, మాసాయిపేట, హకీంపేటలో పేద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వందల ఎకరాలు రూ.6 లక్షలలోపే కొన్నానని స్వయంగా అంగీకరించిన ఈటల రాజేందర్ బ్రోకర్ కాక మరేమి అవుతారని ప్రశ్నించారు.
మంత్రిగా ఉండి అసైన్డ్ భూములను కొనకూడదని తెలిసినా పేదల భూములు కాజేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈటలేనని ధ్వజమెత్తారు. ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సీఎం కేసీఆర్ భూములను సేకరిస్తున్నారని వివరించారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్గా ఈటల బ్రోకరిజం చేస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈటల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, తక్షణమే సీఎం కేసీఆర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.