కరీంనగర్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్ టౌన్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజు శుక్రవారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన నామినేషన్ పత్రాలను ఆర్డీవో కార్యాలయంలో దాఖలు చేశారు. ఆయన వెంట ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి వెళ్లారు. కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరయ్యారు. హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్న గెల్లు శ్రీనివాస్ తన తల్లిదండ్రులు లక్ష్మి, మల్లయ్య ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ దాఖలు చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనను ఉద్యమ బిడ్డగా గుర్తించి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, ఆయన ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేసినట్టు చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మొదటి రోజు ఇద్దరు అభ్యర్థులు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి రవీందర్రెడ్డి తెలిపారు. గెల్లు శ్రీనివాస్ రెండు సెట్లు, అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన్సూర్ అలీ ఒక సెట్ నామినేషన్ వేసినట్టు ఎన్నికల అధికారి పేర్కొన్నారు.
ఈటలకు బుద్ధిచెప్పాలి: వినోద్
గెల్లు నామినేషన్ దాఖలు తరువాత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్లో ఉప ఎన్నిక ఎవరి స్వార్థం కోసం వచ్చిందో ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. స్వార్థపరులు, వెన్నుపోటు దారులకు బుద్ధి చెప్పాలంటే సీఎం కేసీఆర్ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఐదేండ్లు అధికారంలో ఉండి సేవ చేయాలని ప్రజలు ఓటు వేస్తే తన వ్యక్తిగత ఎజెండాతో మధ్యలోనే పదవికి రాజీనామా చేసి యుద్ధంలో కత్తి వదిలి పారిపోయిన సైనికుడిలా ఈటల రాజేందర్ మిగిలి పోయారన్నారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే హుజూరాబాద్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని హామీ ఇచ్చారు. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన తనను ఉద్యమ బిడ్డగా గుర్తించి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేసినట్టు చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు తనను ఆదరిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఆలయాల్లో ‘గెల్లు’ పూజలు
చేర్యాల/ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్, అక్టోబర్ 1: నామినేషన్ వేసే ముందు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి, కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట రాములోరి ఆశీస్సులు తీసుకున్నారు. అర్చకులు నామినేషన్ పత్రాలను స్వామివార్ల ముందు పెట్టి పూజలు చేసి గెల్లుకు అందజేశారు. ఇల్లందకుంటలో ఆయన వెంట రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారు. జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాలోనూ ప్రార్థనలు చేశారు.