గ్రాన్యూల్స్ సీఎండీకి గౌరవ డాక్టరేట్
పటాన్చెరు, ఆగస్టు 28 : గీతం హైదరాబాద్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 12వ స్నాతకోత్సవం కనులపండువలా జరిగింది. గ్యాన్యూల్స్ ఇండియా లిమిటెట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ (డీఎస్సీ)ని ప్రదానం చేశారు. 2020-21 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యూమానిటీస్ కోర్సులు పూర్తి చేసిన దాదాపు 1,300 మంది పట్టభద్రులకు డిగ్రీలను, 13 మంది టాపర్లకు బంగారు పతకాలను అందజేశారు. కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం శ్రీభరత్, కార్యదర్శి ఎం భరద్వజ, వీసీ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ, ప్రోవీసీలు ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్, ప్రొఫెసర్ డీ సాంబశివరావు, రిజిస్ట్రార్ డీ గుణశేఖరన్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
74 ఏండ్ల వయసులో పీహెచ్డీ
గీతం 12వ స్నాతకోత్సవం ఓ అరుదైన రికార్డుకు వేదికైంది. డాక్టర్ సుబ్బారావు తులసి తన 74వ యేట మేనేజ్మెంట్లో పీహెచ్డీ పట్టాను పొందారు. జీహెచ్బీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ సుమన్బాబు మార్గదర్శనంలో నాయకత్వ శైలి, దాని ఫలితం అనే అంశంపై పీహెచ్డీ పూర్తి చేశారు.