హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/ పటాన్చెరు: వైద్యరంగంలో విశేషసేవలకుగాను ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు గీతం ఫౌండేషన్ అవార్డును అందజేయనున్నట్టు యూనివర్సిటీవర్గాలు శుక్రవారం వెల్లడించాయి. సంస్థ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం వైజాగ్ గీతం క్యాంపస్లో గీతం అధ్యక్షుడు ఎం శ్రీభరత్ సమక్షంలో ఉపకులపతి కే శివరామకృష్ణ ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. డాక్టర్ రణదీప్ గులేరియా దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పల్మనాలజిస్ట్. పల్మనరీ, క్రిటికల్ కేర్ మెడిసిన్లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు.