హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పదోన్నతుల్లేక ఎనిమిదేండ్లు.. బదిలీల్లేక ఐదేండ్లు. పదోన్నతుల షెడ్యూల్ విడుదలయ్యాక ఎనిమిది నెలలుగా కోర్టుకేసుతో రేపోమాపో.. అన్న ఎదురుచూపులు. సీనియర్లే అయినా పదోన్నతి రాకుండానే రిటైర్ అవుతామేమోన్న బెంగ. ఉద్యో గ చరమాంకంలో ఏదో తెలియని వెలితి. ఈ ఒక్క టి లభిస్తే బాగుండు అన్న ఆశ. ఇలాంటి బెంగ ఇప్పుడు తీరుతున్నది. వేలాది టీచర్ల ఆశ ఇప్పుడు నెరవేరుతున్నది. పాఠశాల విద్యతో పదోన్నతులు.. పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతులు పొందిన టీచర్లు సంబురాలు చేసుకొంటున్నారు. ప్రభుత్వం పదోన్నతుల్లో భాగంగా ముందుగా గెజిటెడ్ హెచ్ఎంల (జీహెచ్ఎం) బదిలీలు చేపట్టింది. ఇలా 1,788 హెచ్ఎంలు బదిలీ అయ్యారు. ఇక ఆ తర్వాత ఏర్పడిన ఖాళీల్లో 1,219 స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించింది. ఆయా హెచ్ఎంలు ఆది, సోమవారాల్లోనే విధుల్లో చేరారు.
మల్టీజోన్ -2లో కేసు
వాస్తవానికి 1,947 స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించాల్సి ఉన్నది. మల్టీజోన్-2లో బదిలీలు, పదోన్నతులపై కేసుల కారణంగా ఈ జోన్ పరిధిలో జిల్లా పరిషత్తు స్కూ ల్ అసిస్టెంట్లకు పదోన్నతులు నిలిచిపోయాయి. మల్టీజోన్ -1లోని ప్రభుత్వ స్కూళ్లు, జిల్లా పరిషత్తు స్కూళ్లు, మల్టీజోన్ -2 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లల్లో అర్హులైన వారికి పదోన్నతులిచ్చారు. దీంతో 1,219 స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా పదోన్నతి పొందారు. మల్టీజోన్ -2లో జడ్పీ టీచర్ల బదిలీలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినా పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని భావించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది.
28, 29న ఎస్ఏ బదిలీలకు వెబ్ఆప్షన్లు
మల్టీజోన్-2లో జడ్పీ టీచర్ల బదిలీలు మినహా మిగతా ప్రక్రియను పూర్తిచేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో మల్టీజోన్-1లోని ప్రభుత్వ స్కూళ్లు, మల్టీజోన్ -2 పరిధిలోని జడ్పీ, ప్రభుత్వ స్కూళ్ల ల్లో స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ) బదిలీలు చేపట్టనున్నది. ఈ బదిలీలకు ఈ నెల 28, 29న వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం వెల్లడించారు. 30న వెబ్ ఆప్షన్లను సవరించుకోవచ్చని తెలిపారు.