Gas KYC | ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 17: గ్యాస్ కేవైసీ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చిన అతడు.. రద్దీగా ఉండటంతో రాత్రికి ఇంటికెళ్లలేదు. ఆ పక్కనే ఓ లారీ కింద నిద్రించి.. ఆకలికి, చలికి తట్టుకోలేక మృతిచెందాడు. ఆదిలాబాద్ రూరల్ మండలం సిరికొండకు చెందిన అంగ పొచ్చన్న(40), ఆయన కుమారుడు సాయి చరణ్ శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో కేవైసీ చేసుకోవడానికి వచ్చారు.
జనం ఉండటంతో మధ్యాహ్నం పొచ్చన్న కుమారుడిని ఇంటికి పంపించాడు. తాను మాత్రం రాత్రికి ఇంటికెళ్లకుండా అక్కడే ఉండి లైన్లో నిల్చుంటే.. కేవైసీ తొందరగా చేయించుకోవచ్చని భావించాడు. అక్కడే ఓ లారీ కింద నిద్రపోయాడు. ఎంతకూ పొచ్చన్న ఇంటికి రాకపోవడంతో ఆదివారం ఉదయం ఆయన భార్య ప్రమీల, కొడుకు సాయిచరణ్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చి చూడగా.. ఆ దగ్గరలోనే ఉన్న లారీ కింద విగతజీవిగా కనిపించాడు. రోజంతా భోజనం చేయకపోవడం, చలి తీవ్రతతోనే మృతి చెందినట్టు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు.