BC Degree College | హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ది కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 నూతన బీసీ డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి శుక్రవారం జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనం అన్నారు.
తెలంగాణకు పూర్వం కేవలం 19 బీసీ గురుకులాలు అరకొర వసతులతో ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో వాటిని నేడు 327కు పెంచుకున్నామని కమలాకర్ తెలిపారు. విద్య ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని నమ్మే సీఎం కేసీఆర్, అందుకోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారన్నారు. కేవలం బీసీ గురుకులాల ద్వారానే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది వెనుకబడిన బిడ్డలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గత విద్యా సంవత్సరం 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసుకొని క్లాసులు ప్రారంభించుకున్నామని, వాటి ద్వారా 15,360 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభించే డిగ్రీ కాలేజీల్లో 16,320 మందికి లబ్ది చేకూరుతుందన్నారు. కేవలం డిగ్రీ గురుకులాల్లోనే 31,680 మందికి ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఈ నూతన డిగ్రీ కాలేజీలతో రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటవుతుందన్నారు.
కొత్త డిగ్రీ కాలేజీలు ఇవే..
ఈ ఏడాది ప్రారంభించబోయే బీసీ డిగ్రీ గురుకులాల్ని జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంబీం అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రారంభించనున్నారు.