హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఇన్సూరెన్స్ పేరుతో రిటైర్డు ఉద్యోగి దంపతులకు దగ్గరైన ఓ ముఠా వారి నుంచి సుమారు రూ.5 కోట్లు స్వాహా చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేసినట్టు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపారు. హైదరాబాద్ మోతీనగర్లో జగపతి రామరాజు (74), భార్యతో కలిసి నివసిస్తుండగా, వారి పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. కుత్బుల్లాపూర్కు చెందిన పుల్లేటి సుబ్రమణ్యం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలంటూ రామరాజుకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో బజాజ్ అలియాంజ్లో పనిచేసే అతని స్నేహితుడైన బీరంగూడవాసి ఉడుత మనోజ్కుమార్ను పరిచయం చేశాడు. ఈ సమయంలోనే వృద్ధులు ఒంటరిగా ఉన్నారని, పిల్లలు విదేశాల్లో ఉంటూ పెద్ద మొత్తంలో డబ్బు పంపిస్తున్నారని గుర్తించారు. ఆ తరువాత వారి స్నేహితుడైన గుర్రంగూడకు చెందిన మహేశ్గౌడ్ను కూడా తమతో కలుపుకొని వృద్ధులను ట్రాప్ చేసి మోసం చేయాలని ప్లాన్ చేశారు. పాలసీలతో మంచి లాభాలున్నాయని నమ్మించి ఇన్సూరెన్స్ చేయించారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్లకు బోనస్ వస్తుందని, వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి పైసలు కట్టాలంటూ వల వేశారు. ఆ పైసలు తిరిగి బోనస్, ఇన్సూరెన్స్లతో కలిసి వస్తాయని నమ్మిస్తూ దఫదఫాలుగా మొత్తం రూ.4.94 కోట్లు స్వాహా చేశారు. కొన్నాళ్లకు రామరాజు అమెరికాలో ఉన్న తన కొడుకుతో ఇన్సూరెన్స్లపై చర్చించారు. ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టానని, సంబంధించిన పేపర్లను వాట్సాప్లో కొడుకుకు పంపించారు. వాటిని పరిశీలించిన కొడుకు అవి నకిలీవని చెప్పారు. మోసాన్ని గుర్తించిన వృద్ధ దంపతులు మూడు రోజుల క్రితం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులైన సుబ్రమణ్యంను గుడివాడలో, మహేశ్గౌడ్ను వనపర్తిలో, మనోజ్ను కరీంనగర్లో శుక్రవారం అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించి కోర్టులో హాజరుపరిచారు.