న్యూఢిల్లీ : గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతల్లో అమలు చేసి చూపిస్తున్నారని పార్లమెంట్లో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మంచి నీటి సరఫరా కోసం ప్రాజెక్టుల మంజూరుపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంబంధిత గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను ఎంపీ రంజిత్రెడ్డితో పాటు పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత, మాలోత్ కవితతో కలిసి లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసీఆర్ తీసుకుంటున్న చర్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి సరఫరా కోసం మిషన్ భగీరథ ద్వారా 100 శాతం గ్రామాలకు నల్లాల ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామన్నారు. పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి స్థానికంగానే ప్రజలు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, కల్లాలు, రైతు వేదికలు పూర్తి చేశామన్నారు.
గ్రామ స్థాయిలో సర్పంచ్ లకే పూర్తి స్థాయి అభివృద్ధి అధికారాలు అప్పగించామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఆయా పథకాలు అద్భుతంగా అమలు అవుతున్నాయన్నారు. ఈ-పంచాయతీ, ఆడిటింగ్ వంటి అంశాల్లో నూ తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలను దేశ వ్యాప్తంగా అనుకరించాలని కూడా కేంద్రం దేశంలోని మిగతా రాష్ట్రాలకు సూచించిన విషయాన్ని ఎంపీ రంజిత్ గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫుగ్గన్ సింగ్ కులస్తే తెలంగాణ ఎంపీలకు రాత పూర్వకంగా సమాధానమిస్తూ.. ఇంతకు ముందు ఐడబ్ల్యూఎంపీ-డబ్ల్యూడీసీ-పీఎంకేఎస్వై పథకం కింద 276 వాటర్షెడ్ ప్రాజెక్ట్ పథకాలను మంజూరు చేయగా అందులో 190 ప్రాజెక్టులు పూర్తి చేశామని, మిగితావి 85 ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయనీ, కొవిడ్ కారణంగా ఆగిపోయాయని వాటిని పూర్తి చేయడానికి ఇప్పటికే 67.26 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అట్లాగే జిల్లాల వారీగా 25 జిల్లాలో ప్రాజెక్టులు మంజూరు చేశామని వాటికి రూ.85,617.22 కోట్లు మంజూరు చేశామని మంత్రి వివరించారు.