యాదాద్రి భువనగిరి, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఇల వైకుంఠం దివి నుంచి భువికి దిగొచ్చినట్టుగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా పునర్నిర్మించిందని ఆధ్యాత్మిక గురువు, దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రశంసించారు. యాదగిరిగుట్ట క్షేత్రం ఇలవైకుంఠంగా వర్ధిల్లుతున్నదని పేర్కొన్నారు. లక్ష్మీనరసింహ స్వామి ఆజ్ఞతోనే సీఎం కేసీఆర్ ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్పారు. రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. అభివృద్ధిలోనూ పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. శనివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారిని స్వామీజీ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామీజీ ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. ఆ విశేషాలు స్వామీజీ మాటల్లోనే.. ‘తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణాన్ని అద్భుతంగా చేపట్టింది. భక్తులకు ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదాన్ని పంచే విధంగా నిర్మించడం అభినందనీయం. పూర్తి కృష్ణశిలతో నిర్మించిన ఈ గుడిని చూస్తుంటే.. ఇలవైకుంఠం దివి నుంచి భువిపై అడుగిడినట్టు ఉంది. యజ్ఞంలా ఆలయాన్ని పునరుద్ధరించడం గొప్ప విషయం. ఆలయ మాడవీధులు, ప్రాకారాలు, శిల్పాలు, క్యూ కాంప్లెక్స్, లక్ష్మీ పుష్కరిణి, వ్రతమండపం, కల్యాణ కట్ట ప్రతీది ఆకర్షణీయంగా నిర్మించారు. కొండపైన, కింద, పట్టణమంతా గ్రీనరీ, పరిశుభత్రతో సుందరంగా ఉంది. ఘాట్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన చెట్లు, పార్కులు పచ్చదనాన్ని పంచుతున్నాయి. తమిళనాడులో ఆలయాలను చూసి.. తెలంగాణలో కూడా అలాంటి కట్టడాలు ఉంటే బాగుండేదని అనుకునేవాడిని. అది సీఎం కేసీఆర్ రూపంలో సాధ్యమైంది. ఇలాంటి కట్టడం ఈ మధ్య కాలంలో ఎక్కడా నిర్మించలేదు. లక్ష్మీనరసింహస్వామి ఆజ్ఞతోనే కేసీఆర్.. చక్రవర్తులు, మహారాజుల మాదిరిగా ఎంతో అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ యజ్ఞంలో కళాకారులు, శిల్పులు ఎంతో మంది భాగస్వాములయ్యారు. వారికి స్వామివారికి సేవ చేసుకొనే యోగం కలిగింది. భవిష్యత్లో యాదగిరి క్షేత్రం చరిత్రలో నిలిచిపోతది’ అని స్వామీజీ ఆశీస్సులు అందజేశారు.
‘కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడు. ఎన్నో జన్మలు తపస్సు చేస్తేనే యోగి అవుతాడు. అటువంటి యోగి తెలంగాణ రాష్ర్టానికి సీఎం కావడం గొప్ప వరం. దేవుడు ఆయనకు ఎంతో జ్ఞానం ఇచ్చారు. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో ఓ ఐడియా, విజన్ ఉన్న నేత. అభివృద్ధి కార్యసాధకుడు. అందరికీ సంక్షేమ ఫలాలు ఎలా అందించాలి, అందరినీ సమన్వయం ఎలా చేయాలనేది కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలి. ఆకాశానికి పందిరి ఎవరూ వేయలేరు. కొంత మందికి కొన్ని నచ్చవు. చిన్న చిన్న ఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్లాలి. మనుషుల్లో పరిశుభ్రత పెరగాలి. ప్రజల్లో చైతన్యం రావాలి’ అని స్వామీజీ పేర్కొన్నారు.
ఉదయం తన పరివారంతో యాదాద్రి క్షేత్రానికి చేరుకున్న దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీకి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో డప్పు వాయిద్యాల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భాలయంలో స్వయంభూ లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలు చేసిన స్వామీజీ.. ప్రధానాలయంలోని ధ్వజస్తంభానికి నమస్కరించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కుటుంబ సభ్యులతోపాటు భక్తులకు స్వామీజీ ఆశీస్సులు అందజేశారు. స్వామీజీకి స్వాగతం పలికిన వారిలో మంత్రితోపాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఈఓ గీత తదితరులు ఉన్నారు.