హైదరాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): భవన నిర్మాణాల్లో దేశవ్యాప్తంగా ఒకే నియమావళిని నిర్బంధంగా అమలు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణాలపై భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) రూపొందించిన నూతన నియమావళిపై చర్చించేందుకు రెండు రోజుల సదస్సు హైదరాబాద్లో గురువారం ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు పాల్గొనగా తెలంగాణ సెక్రటేరియట్, అమరజ్యోతి తదితర నిర్మాణాల్లో జాతీయ భవన నియమావళి కీలక పాత్ర పోషించిందని గణపతిరెడ్డి చెప్పారు. బీఐఎస్ హైదరాబాద్ శాఖ అధిపతి కేవీ రావు నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న నిపుణులకు బీఐఎస్ ఢిల్లీ సంయుక్త కార్యదర్శి మధురిమా మాధవ్, యూపీ ప్రభుత్వ రిటైర్డ్ ముఖ్య ప్రణాళికాధికారి రాజ్పాల్ కౌశిక్ నూతన నియమావళి ముసాయిదాను వివరించారు. నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.