మెదక్ : గజ్వేల్ రైల్వే స్టేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన రేక్పాయింట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు పలువురు పాల్గొన్నారు. తొలి విడతలో ఏపీలోని కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ నుంచి 21 బోగీల్లో 1300 మెట్రిక్ టన్నుల ఎరువులు గజ్వేల్ ష్టేషన్కు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లా దశాబ్దాల పోరాటం ఫలితంగా రేక్ పాయింట్ ఏర్పాటైందని పేర్కొన్నారు. ఈ రేక్ పాయింట్ జిల్లా ప్రజలకు వరం అని చెప్పారు. కేంద్రానిదే రైల్వే లైన్ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ రైల్వే లైన్ కోసం నాటి సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య నిధులు ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతు నిధులను ఎప్పటికప్పుడు ఇచ్చిందని తెలిపారు. కొత్తపల్లి – మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ లైన్ కోసం 2,200 ఎకరాల భూసేకరణ చేశామని హరీశ్రావు తెలిపారు.