గజ్వేల్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. గజ్వేల్ నియోజకవర్గంపై తనకు ఉన్న అభిమానాన్ని, మమకారాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు తనకు బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అయితే, ఆ తర్వాత.. సాధించిన తెలంగాణను తీర్చిదిద్దడం కోసం తనను ఎమ్మెల్యేను చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ ఈ గజ్వేల్ గడ్డ అని చెప్పారు. గజ్వేల్ తన గౌరవాన్ని పెంచిందని, తనను ఈ స్థాయికి తెచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గజ్వేల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు.
‘తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు నాకు బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట. ఆ తర్వాత.. సాధించిన తెలంగాణను తీర్చిదిద్దడం కోసం నన్ను ఎమ్మెల్యేను చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ ఈ గజ్వేల్ గడ్డ. గజ్వేల్ నా గౌరవాన్ని పెంచింది. నన్ను ఈ స్థాయికి తెచ్చింది. గత తొమ్మిదిన్నర ఏండ్లుగా నేను గజ్వేల్ ప్రాంతం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాను. ఇప్పుడే పెద్దలు ప్రతాపరెడ్డి గారు మీకు అన్నీ వివరించారు. నేను మళ్లా అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మంచి నీళ్ల కోసం నానా ఇబ్బందులు పడిన గజ్వేల్కు శాశ్వతంగా ఆ బాధ తీరిపోయింది. సాగు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడిన గజ్వేల్కు ప్రాజెక్టులు, కాలువలు రావడంతో ఆ బాధ కూడా తీరిపోయింది’ అని సీఎం అన్నారు.
‘మన గజ్వేల్కు రైలు వస్తదని ఎన్నడూ అనుకోలేదు, కానీ రైలు కూడా వచ్చేసింది. గజ్వేల్ ఒక గుర్తింపు కలిగిన నియోజకవర్గంగా ఎదిగింది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి గజ్వేల్ మోడల్ అభివృద్ధిని చూడటానికి వస్తున్నరు. మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, మన అడవుల పునరుద్ధరణ కావచ్చు, మన మల్లన్నసాగర్ ప్రాజెక్టు కావచ్చు.. ఇట్ల అనేక రకాల పనులను చూడటానికి ఇయ్యాల గజ్వేల్కు వస్తున్నరు. మిషన్ భగీరథ పథకాన్ని గురించి తెలుసుకోవడానికి కోమటిబండకు రాని రాష్ట్రమే లేదు భారత దేశంలో. అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం తాగుతున్నది, సాగుకు వినియోగిస్తున్నది మనందరం ఎంతో పవిత్రంగా భావించే గోదావరి జలాలు. ఇలా ఒక రోల్ మోడల్గా గజ్వేల్ ఎదిగింది. అయితే ఇప్పటికే అయ్యింది చాలా గొప్ప అని మనం సంతోషపడితే కాదు, ఇంకా చాలా అభివృద్ధి కావాల్సి ఉంది’ అని సీఎం చెప్పారు.