హైదరాబాద్ : ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar ) పార్థీవదేహాన్ని ప్రజా సందర్శనార్థం ఎల్బీ స్టేడియానికి గద్దర్ తరలించారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్(74) అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ 1949లో మెదక్ జిల్లా తూప్రాన్లో దళిత కుటుంబంలోని లచ్చమ్మ, శేషయ్య దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.
తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసి ఆలపించిన అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1997 ఏప్రిల్ 6న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గద్దర్పై కాల్పులు జరిగాయి. ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే సినిమా పాటకు నంది అవార్డు వచ్చింది. అయితే అవార్డును ఆయన తిరస్కరించారు. అయినప్పటికి ప్రజా సమస్యలపై చివరి వరకు పోరాడారు. గద్దర్ మృతిపట్ల పలువురు రాజకీయ, సాహితీ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.