హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ మద్దతు పలికాయి. దీంతో స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి గడ్డం ప్రసాద్ను తోడ్కొని వెళ్లి శాసనసభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
శాసన సభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ 1964లో వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారు. తాండూరులో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. తొలుత ఎంపీటీసీగా గెలిచి, ఆ తర్వాత ఎంపీపీగా సేవలు అందించారు. 2008 ఉప ఎన్నికలో వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రెండోసారి గెలుపొంది, 2012లో కిరణ్కుమార్రెడ్డి మంత్రి వర్గంలో చేనేత, చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రిగా సేవలందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకుని స్పీకర్గా ఎన్నికయ్యారు.
శాసనసభలో స్పీకర్కు ధన్యవాద తీర్మానంపై తొలుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగించారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యావాదాలు తెలిపారు. శాసనసభ తొలిరోజే మంచి సంప్రదాయానికి నాంది పలికిందని, భవిష్యత్తులోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని కోరారు. మంత్రిగా ప్రసాద్ చేసిన సేవలను గుర్తుచేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి, తుమ్మల, సీతక్క, కొండా సురేఖతోపాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. విపక్షాల నుంచి కూనంనేని సాంబశివరావు, భలాలా మాట్లాడారు.
స్పీకర్కు ధన్యవాద తీర్మానంపై బీఆర్ఎస్ నుంచి తొలుత మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. స్పీకర్ ఎన్నికకు మద్దతివ్వాలని మంత్రి శ్రీధర్ బాబు కోరగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు సంపూర్ణ మద్దతివ్వాలని తమను ఆదేశించారని తెలిపారు. స్పీకర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రసాద్ చేనేత మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోనే అత్యధికమంది చేనేత కార్మికులు ఉన్న సిరిసిల్లకు విచ్చేయాలని ఎమ్మెల్యేగా తాను స్వయంగా విజ్ఞప్తి చేశానని వివరించారు. అయితే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నందున సిరిసిల్లకు విచ్చేసేందుకు కొంత సంశయం వ్యక్తం చేయగా, తానే స్వయంగా ఆయనను తీసుకుని వెళ్లానని గుర్తుచేశారు. చేనేత కార్మికుల సమస్యలను వినడంతోపాటు, తన శక్తిమేరకు పరిష్కరించారని తెలిపారు. స్పీకర్గా ఎన్నికైన ప్రసాద్కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్రెడ్డి తరహాలోనే సభా హకులను కాపాడాలని కోరారు. సామాన్య ప్రజలు సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలని, ముఖ్యంగా ప్రజల తరపున మాట్లాడే నాయకులకు అధిక సమయమివ్వాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, కడియం శ్రీహరి, ప్రశాంత్రెడ్డి, దానం నాగేందర్ తదితరులు మాట్లాడారు.
శాసనసభ స్పీకర్కు ధన్యవాద తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ప్రసాద్, తాను అపూర్వ స్నేహితులమని గుర్తుచేశారు. పక్కపక్క మండలాల నుంచే ఒకేసారి ఎంపీటీసీలుగా ఎన్నికయ్యామని తెలిపారు. వికారాబాద్ స్థానం కోసం ఇద్దరం 4 సార్లు పోటీపడ్డామని, 2008లో నామినేషన్ వేసేందుకు ట్రాఫిక్ వల్ల ఆలస్యమైతే తన బైక్పైనే తీసుకువెళ్లానని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధినేత తనను వికారాబాద్ నుంచి పోటీ చేయాలని రెండు సార్లు కోరినా తాను చేయలేదన్నారు. చిరకాల మిత్రుడు స్పీకర్ కావడంపై సంతోషకరమని చెప్పారు.
అసెంబ్లీలో ఊహించని పరిణామం చోటుచేసుకు న్నది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రమాణం చేస్తున్న సమయంలో ఆయన కుమార్తె మీడియా గ్యాలరీలో నుంచి ‘ఐ లవ్యూ డాడీ’ అని పెద్దపెట్టున అరవడంతో సభ్యులు ఉలిక్కిపడ్డారు. అసలు విషయం తెలిసి కుదుటపడ్డారు. కౌశిక్రెడ్డి కుమార్తెను భద్రతా సిబ్బంది మీడియా గ్యాలరీ నుంచి విజిటింగ్ గ్యాలరీకి తీసుకెళ్లారు.
సభ్యుల ప్రసంగం అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలియజేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సభలో అర్థవంతమైన చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు. చర్చల్లో చురుగ్గా పాల్గొని అభివృద్ధికి పాటుపడాలని అభిలషించారు. పార్టీలకతీతంగా సేవలందిస్తానని, సమస్యల ఆధారంగా సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. సభ నిర్వహణలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిపేందుకు అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ సహకరించాలని కోరారు. అనంతరం సభను శుక్రవారం ఉదయం 11.30కు వాయిదా వేశారు.
అంతకుముందు సభ మొదలైన వెంటనే పలువురు సభ్యుల చేత ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ప్రమాణం చేశారు. దీంతో మొత్తంగా 117 మంది ప్రమాణస్వీకారం పూర్తయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైద్యచికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్రమాణస్వీకారం చేయలేదు. మరో సభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి కూడా హాజరు కాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్గా అక్బురుద్దీన్ ఒవైసీ నియామాకాన్ని వ్యతిరేకిస్తూ ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్ ఎన్నికైన అనంతరం బీజేపీ సభ్యులు అసెంబ్లీలోకి ప్రవేశించారు. అనంతరం స్పీకర్ సమక్షంలో ఏలేటి మహేశ్వర్రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, పాల్వాయి హరీశ్, పాయల్ శంకర్, రామారావు పవార్, డీ సూర్యనారాయణ, టీ రాజాసింగ్ ప్రమాణం చేశారు.