హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా బ్లాక్మెయిల్ విధానాలు మానడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ విమర్శించారు. రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ సొసైటీలో బ్లాక్మెయిల్ చేసి అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. రేవంత్రెడ్డి తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఎన్నికల కోడ్ను సాకుగా చూపి ఆగస్టు 15 అంటూ కొత్త తేదీ ప్రకటించారని మండిపడ్డారు. అప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ పేరుతో వాయిదా వేస్తారని ఎద్దేవా చేశారు.
18 ఏండ్లు దాటిన మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీని విస్మరించిన కాంగ్రెస్ ఇప్పుడు రూ.లక్ష రూపాయలిస్తామంటూ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. ముదిరాజ్లకు మంత్రిపదవి ఇవ్వడం ఇష్టంలేకే 14 ఎంపీ సీట్లు గెలిపించాలని, కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. మోదీతో చీకటి ఒప్పందం చేసుకొని, కాంగ్రెస్ నుంచి బలహీన అభ్యర్థులను నిలబెట్టారని విమర్శించారు. దానం నాగేందర్ జీవితం మొత్తం పార్టీ ఫిరాయింపులేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆత్మ కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమేనని, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.
బీజేపీ మ్యానిఫెస్టోలో చెప్పిందే చెప్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నదని, పదేండ్ల పాలనలో బీజేపీ ఒక హామీ కూడా నెరవేర్చలేదని కిశోర్కుమార్ దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో ప్రభుత్వరంగ సంస్థలను ఆగం చేశారని, ఐదు లక్షల కంపెనీలు మూతబడ్డాయని, ప్రభుత్వ ఉద్యోగాలను ఖతం చేసి, రిజర్వేషన్లకు తూట్లుపొడుస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు చిరుమల్ల రాకేశ్, గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ధర్మేందర్రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్, యుగేందర్రెడ్డి పాల్గొన్నారు.