నిర్మల్ : జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. నిర్మల్లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో కీలక అడుగు ముందు పడింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానకు అనుబంధ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిపాలన అనుమతులు జారీ చేస్తూ జీవోను విడుదల చేసింది.
100 ఎంబీబీఎస్ సీట్లు..రూ166 కోట్ల అంచనా వ్యయంతో వైద్య కళాశాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. ఎన్నో ఏండ్ల మెడికల్ కళాశాల ఏర్పాటు కల సాకారం కావడంతో జిల్లా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం కేసీఅర్, మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని గజమాలతో సత్కరించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..మెడికల్ కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజలకు కార్పొరేట్ వైద్యసేవలు మరింత దగ్గర కానున్నాయన్నారు.
జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కాలేదేదని, కాదు అని కొంత మంది అవగాహనరాహిత్యంతో అవాకులు చెవాకులు పేలారు. ఇప్పుడు వారు ఏం సమాధానం చెప్పుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా వక్రబుద్ధితో మాట్లాడటం మానుకోవాలని మంత్రి హితవు పలికారు.