హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ) : స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో-9పై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను పరిశీలించాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్తో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పుపై గురువారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ..
రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వం చట్టం చేసి పంపితే కేంద్రంలోని బీజేపీ సర్కారు అడ్డుకున్నదని ఆరోపించారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లులను మూడు నెలల్లోపు ఆమోదించకుంటే.. ఆ బిల్లులు ఆమోదించబడినట్లుగానే పరిగణించాల్సి ఉన్నదని, దీని ప్రకారం గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినట్లేనని తెలిపారు. అందుకే తాము జీవో-9 విడుదల చేసినట్టు తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై తమ కు చిత్తశుద్ధి ఉన్నట్టు స్పష్టంచేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. జీవో-9పై హైకోర్టు స్టే విధించడంపై గురువారం ఆయన స్పందించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించినప్పటికీ కోర్టు స్టే విధిస్తుందనుకోలేదని చెప్పారు. ఈ కేసులో బీజేపీ ఎందుకు ఇంప్లీడ్ కాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలు జరపకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని పేర్కొన్నారు.