12వ తేదీ వరకు రాష్ట్రంలోకి..
బలహీన సముద్ర గాలులే కారణం
నేడు పలు జిల్లాల్లో వడగాడ్పులు !
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం అవుతున్నాయి. అరేబియా, బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలహీనంగా ఉండటంతో రుతుపవనాల ప్రయాణం నెమ్మదించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. దీంతో సముద్రంలోని తేమ భూమి మీదకు రావడం లేదని చెప్పారు. ఈ రెండు సముద్రాలలోని గాలులు బలంగా ఉన్నప్పుడు అవి కలుస్తాయని, అప్పుడు సముద్రంలోని తేమ భూమి మీదకు వస్తుందని, దీంతో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తాయని వివరించారు. ఈ గాలులు రెండు, మూడు రోజుల్లో బలపడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ నెల 12వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
నైరుతి రాక మరింత ఆలస్యం కావడంతో రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయన్నారు. బుధవారం 22 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైన నమోదయ్యాయని టీఎస్డీపీఎస్ తెలిపింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో 16 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా నారాయణపేట జిల్లా నర్వలో 3.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఈ నెల 12వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వివరించింది.