Funtastic | ‘హైదరాబాద్ పోంగనే ఎన్నికల కమిటీలతో సమావేశం అయితం’ అని ఢిల్లీలో చెప్పిన విషయం కిషనాలు సారుకు పొద్దుగాల్లనే యాదికొచ్చింది. వెంటనే పీఏను పిలిశిండు.
కిషనాలు: ఎన్నికల కోసం మనం ఎన్ని కమిటీలు ఏశినం?
పీఏ: అవ్ సార్.. 14 కమిటీలు ఏశిన్రు
కిషనాలు: అందరినీ ఆఫీస్కు రమ్మను.
ఢిల్లీ ఫోన్: హలో… కిషనాలు జీ.. మ్యానిఫెస్టో రెడీ అయ్యిందా? ప్రింటింగ్కు పంపిద్దామా?
కిషనాలు: ఒక్క నిమిషం సార్ (ఫోన్ మ్యూట్ల పెట్టి పీఏతో.. మన మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్కు ఫోన్ చెయ్ అన్నడు)
పీఏ కండ్లు తేలేశిండు. అది.. అది.. అంటుంటే.. సారుకు డౌట్ కొట్టింది. వెంటనే ఫోన్లో ‘సాబ్.. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నది. మళ్లీ చేస్త’ అని పెట్టేశిండు.
కిషనాలు: ఏమైంది పీఏ..
పీఏ:సార్.. మన మ్యానిఫెస్టో కమిటీకి వివేక్ చైర్మన్ ఉండె. ఆయన ఇయ్యాలనే మన పార్టీకి రాజీనామా ఇచ్చి.. కాంగ్రెస్కు పోయిండు.
(దెబ్బకు సారుకు దిమాక్ ఖరాబైంది. మరి మన మ్యానిఫెస్టో? మ్యానిఫెస్టో తయారు చేస్తున్నాం.. రావాలి.. మీకేం కావాలో చెప్పుకోవాలి.. అంటూ వివేక్ గతంలో ఇచ్చిన ప్రకటనలు, కొందరు వచ్చి మెమోరాండం ఇచ్చిన విషయాలు గుర్తుకొచ్చినయి)
కిషనాలు: ఆ మెమోరాండాలు, వేరే పార్టీల మ్యానిఫెస్టోలు పట్కరా. అందులో ఏరుకుందాం
పీఏ: అవన్నీ యాడున్నయో సార్. ఇప్పుడు వివేక్ సార్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు.
కిషనాలు: పోనీ.. దానికి జాయింట్ కన్వీనర్ విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నడు కదా. ఫోన్ కలుపు
పీఏ:మన పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకునుడు మీద ఆయన అలిగిండు
కిషనాలు: సర్లే.. మిగిలిన 13 కమిటీలోల్లకు ఫోన్లు చేశినవా? మధ్యాహ్నం రమ్మన్నవా?
(పీఏ మళ్లీ తెల్లమొఖం వేశాడు)
కిషనాలు: మల్లా ఏమైంది! ఆ లిస్ట్ ఇటియ్యి, నేను పేరు చెప్తా… నువ్వు ఫోన్ కలుపు. ముందు, స్క్రీనింగ్ కమిటీకి ఫోన్ చెయ్యి.
పీఏ: సార్.. దాని చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడో జంప్
కిషనాలు: : సర్లే.. ప్రజలను డైవర్ట్ చేసే ఆందోళనల కమిటీ చైర్మన్కు కలుపు
పీఏ: సార్.. దాని అధ్యక్షురాలు విజయశాంతి తనకు టిక్కెట్ ఇస్తలేరని మన పార్టీమీదనే ఆందోళన చేస్తున్నది.
కిషనాలు: పోనీ.. హెడ్క్వార్టర్ కో ఆర్డినేషన్ కమిటీకి, ఎస్సీ నియోజక వర్గాల సమన్వయ కమిటీకి ఫోన్ చెయ్యి.
పీఏ:సార్.. మొదటి దానికి అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి. ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల సమన్వయ కమిటీకి జితేందర్రెడ్డి చైర్మన్. ఆయన నాలుగైదు రోజుల నుంచి బయటికి వస్తలేడు. ఆయన కూడా జంప్ అయితడని టాక్ (సారు బుర్రబద్దలై తలగోక్కున్నడు)
కిషనాలు: ఇవన్నీ వద్దు.. మనం ఏశిన కమిటీలల్ల ఉన్నోళ్ల లిస్ట్ సదువు ఇగ.
పీఏ:సార్.. పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్ బండి సంజయ్కి మనం ఫోన్ చేసే పరిస్థితి లేదు. ఎలక్షన్ కమిషన్ ఇష్యూస్ కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ జంప్. హెడ్ క్వార్టర్స్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ బంగారు శృతి…. (ఇగ చాలు అని నెత్తి పట్టుకున్నడు. మెల్లెగా పీఏ దిక్కు చూసి..)
కిషనాలు: మొత్తం మీద నీకు ఏం అర్థమైంది?
పీఏ: ఏం అనుకోవద్దు సార్.. పట్టిపట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుసుకున్నట్టు. టికెట్లు ఇస్తరో, ఇయ్యరో చెప్పకుండా పదవులు కట్టబెడితే పక్క పార్టీలకు పోయిండ్రు. మన దాంట్ల కమిటీ పదవి ఇస్తే ఖతమే అనే టాక్ మొదలైంది.
(అంతే.. ఖతం.. కిషనాలు సార్ రెండు జేబులల్ల చేతులు పెట్టుకొని.. నడుసుకుంట..!)
…? కాసాని మహేందర్ రెడ్డి