హైదరాబాద్ : దేశంలో బీసీల జనాభాకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలోని బేజేపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న మోసంపై ఆయన మండిపడ్డారు.
దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు కనీసం 5 శాతం బడ్జెట్ కేటాయించారా అని విమర్శించారు. గత సంవత్సరం బీసీల సంక్షేమానికి 1050 కోట్ల రూపాయలు కేటాయించారు. 29 రాష్ట్రాలు,7 కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 1050 కోట్లు కేటాయిస్తే ఒక్కో రాష్ట్రానికి కేవలం 35 కోట్లు మాత్రమే వస్తాయని ఆయన పేర్కొన్నారు.
దేశంలో ఉన్న 70 కోట్ల మంది జనాభా కు బిస్కెట్లు కూడా రావని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ వసూలు ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని కేంద్రానికి సూచించారు.
కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడమే కాకుండా బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో బీసీలకు నిధులు కేటాయించకుండా కేంద్రం అన్యాయం చేస్తోంది.
బీసీ జనాభా లెక్కలు తీయాలి, జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలను బిచ్చగాళ్లను చేస్తోందని ఘాటుగా విమర్శించారు. బీసీలకు బడ్జెట్లో అన్యాయం చేస్తే పార్లమెంట్ను ముట్టడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.
బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ప్రధాని అయినప్పటికీ బీసీలకు బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామన్నారు.
బడ్జెట్లో అన్యాయం చేస్తే బీజేపీ ఎంపీలను, కేంద్ర మంత్రులను సైతం ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు.