ఇప్పుడు నువ్ గిన్ని పైసలు పెట్టు.. రిజల్ట్ రాగానే నాలుగైదు రెట్లు కండ్లజూస్తవ్! ఇదేదో.. క్రికెట్ బెట్టింగ్ అనుకుంటున్రా??కానేకాదు..! తెలంగాణ ఆత్మగౌరవంపై, 400 ఏండ్ల ఘనచరిత్ర కలిగిన మన హైదరాబాద్పై బెట్టింగ్! మన భూములను ఎరగా చూపించి కర్ణాటకలో కాంగ్రెస్ సమీకరించిన డబ్బుకట్టల నీచ రాజకీయమిది. ఇప్పటివరకూ రియల్, నిర్మాణ రంగాల్లో మాత్రమే కనిపించిన ప్రీలాంచ్ వ్యాపారం.. రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్కే దక్కుతున్నది. అంతటితో ఆగిందా?? పచ్చనిపంటపై మిడుతల దండు దాడిచేసినట్టు.. తెలంగాణమీద కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేల దండుయాత్ర మొదలైంది. ఆదమరిచామో.. బంగారంలాంటి మన భూములు కాంగ్రెస్ కబందహస్తాల్లోకి పోవడం ఖాయం. జర భద్రం!!
భూమి ఉంటుంది. కానీ, నిర్మాణ అనుమతులతో పాటు ప్రాజెక్టుకు రెరా ఆమోదం ఉండదు. ఎలా కడతారో తెల్వదు. కేవలం అందమైన గ్రాఫిక్స్లతో కూడిన బ్రోచర్లు కనువిందు చేస్తాయి. అంతే! ఆకాశంలో మేడలు కడుతున్నట్టు ప్రచారం చేస్తారు. విల్లాకు రేటు నిర్ధారించి, కొనుగోలుదారుల నుంచి రూ.కోట్లు వసూలు చేస్తారు.
– రియల్, నిర్మాణ రంగాల్లో జరిగే ప్రీలాంచ్ వ్యాపారం ఇది. చట్టపరంగా ఇదో అవినీతి
ఎన్నికల క్షేత్రంలో ఇంకా ప్రజామోదం రాలేదు. వస్తుందన్న గ్యారంటీ లేదు. కానీ ప్రభుత్వం వస్తే పెట్టిన పెట్టుబడికి పదుల రెట్ల విలువైన హైదరాబాద్ భూములు మీ సొంతం అని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందంటూ పగటి కలల్లో విహరింపజేశారు. వందలు, వేల కోట్ల నిధులను సమీకరించారు.
– రాజకీయాల్లో తొలిసారిగా కాంగ్రెస్ తలపెట్టిన ఎన్నికల ప్రీలాంచ్ ఇది. రాజకీయంగా ఇదో దుర్నీతి
(గుండాల కృష్ణ-హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి) నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఇప్పుడు ప్రీలాంచ్ వంటి నీచ రాజకీయానికి ఒడిగట్టింది. పైగా, నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న విశ్వ నగరం హైదరాబాద్ను పావుగా మార్చింది. ఇక్కడి విలువైన భూములను ఎరగా చూపి… తెలంగాణ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నోట్ల వరద పారించేందుకు బెంగళూరు వేదికగా భారీ స్థాయిలో నిధుల సమీకరణ పూర్తి చేసినట్టు ఆరోపణలున్నాయి. ఐటీ దాడుల్లో కోట్ల కట్టలు బయటపడటం ఇందుకు బలాన్ని చేకూర్చింది. అంతేకాదు గతంలో ఎన్నడూ లేనివిధంగా కర్ణాటక ప్రభుత్వం దాదాపుగా తెలంగాణలో మోహరించడం అనేక సందేహాలకు ఊతమిస్తున్నది. మరి, కాంగ్రెస్ పాచికనే పారితే హైదరాబాద్ భూములు కర్ణాటకకు పందేరం కానున్నాయనేది సుస్పష్టం.
సమీకరణ ముసుగులో భూ పెట్టుబడులు
తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి బెంగళూరు నుంచి నిధుల వరద వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కర్ణాటకలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి కోట్లాది రూపాయల సేకరణ జరిగినట్లు తెలుస్తున్నది. ఒక్కొక్కరి నుంచి కనిష్ఠంగా రూ.50 కోట్ల చొప్పున సేకరించారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఇందుకు హైదరాబాద్ చుట్టుపక్కల భూములను ఎరగా చూపినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్కు ఆర్థికంగా చేయూతనిచ్చిన వారికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భూములను అప్పగించేందుకు కుట్రపన్నినట్టు సమాచారం అందుతున్నది. వారు ఇచ్చిన మొత్తానికి రెండు, మూడు రెట్ల ప్రతిఫలం ఉండేలా నగరం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తామని చెప్పి నిధుల సమీకరణ ముగించినట్లు తెలిసింది. గత పదేండ్లలో బెంగళూరును మించి హైదరాబాద్ ఐటీ, పారిశ్రామికంగా దూసుకుపోతుండటం, అంతకుమించి అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దీంతో దేశంలో ఇతర ఏ రాష్ర్టాల్లో లేనివిధంగా ఇక్కడి రియల్, నిర్మాణ రంగం దూసుకుపోతున్నది. కొంతకాలం కిందట ప్రభుత్వపరంగా జరిగిన భూముల వేలంలో కోకాపేటలో ఎకరం రూ.100.75 కోట్లు పలకడంతో దేశవ్యాప్తంగా ఇక్కడి భూములకు భారీగా డిమాండు వచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా తామిచ్చిన దాని కంటే ఎక్కువ విలువైన భూములు దక్కుతాయనే ఆశతో పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు సహకరించినట్టు తెలుస్తున్నది.
ఐటీ శాఖకూ సమాచారం
తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ బెంగళూరు నుంచి హైదరాబాద్కు పెద్ద ఎత్తున నోట్ల కట్టలను మళ్లిస్తుందనే ప్రచారం చాలా రోజుల కిందటనే జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించారు. సాధారణంగా ఇవన్నీ రాజకీయ ఆరోపణలు అనుకున్నారు. కానీ ఇది వాస్తవమేనన్న సమాచారం ఐటీ శాఖకు కూడా ముందుగానే ఉన్నట్లుగా తెలుస్తున్నది. అందుకే ఇటీవల బెంగళూరు నగరంలో ఏకంగా 45 చోట్ల ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. కర్ణాటక ప్రభుత్వ కాంట్రాక్టర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబికాపతి ఇంట్లో రూ.42 కోట్లు, మాజీ ఎమ్మెల్సీ కాంతరాజ్కు సన్నిహితుడైన బిల్డర్ సంతోశ్ ఇంట్లో రూ.45 కోట్లు పట్టుబడ్డాయి. నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు అత్యంత సన్నిహితులవ్వడంతో కాంగ్రెస్ కోట్ల కట్టల స్కామ్కు పాల్పడిందన్న అనుమానాలు పెరిగాయి. మిగతా మరికొన్ని చోట్ల జరిపిన సోదాల్లో మరో రూ.7 కోట్ల వరకు బయటపడినప్పటికీ… అప్పటికే భారీ మొత్తం సరిహద్దులు దాటాయనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు చెబుతున్న వ్యాఖ్యలు నిజమేనని తేలింది. ముఖ్యంగా ఆ రాష్ట్ర బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ ఐటీ దాడుల్లో బయటపడిన నోట్ల కట్టలపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తెలంగాణ ఎన్నికల కోసమే కర్ణాటక కాంగ్రెస్ నిధుల సమీకరణ చేసిందని, ఐటీ శాఖలో బయటపడిన సొమ్ము కూడా అందులో భాగమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. అంటే, తెలంగాణ కాంగ్రెస్కు బెంగళూరు వేదికగానే రాజకీయ వ్యూహాలతో పాటు ఆర్థికంగానూ సంపూర్ణ సహకారం అందుతున్నట్లుగా బయటి ప్రపంచానికి తెలిసింది.
పది క్లస్టర్లుగా తెలంగాణ..అంతా కర్ణాటక మంత్రులే
సాధారణంగా ప్రదేశ్ కాంగ్రెస్లు ఏఐసీసీ కనుసన్నల్లో నడుస్తాయి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇది రివర్స్గా మారిపోయింది. తెలంగాణ ఎన్నికల కార్యచరణ పెత్తనాన్ని బెంగళూరు పవర్ సెంటర్కు ఫ్రీ హ్యాండ్గా ఇచ్చినట్లు తెలుస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు టికెట్ల ఖరారు మొదలు ప్రతి చిన్న అంశానికీ బెంగళూరు వైపే తొంగి చూశారు. తెలంగాణలో ఇప్పటివరకు 54 మంది ఎన్నికల పరిశీలకులను కాంగ్రెస్ నియమిస్తే.. వీరంతా కర్ణాటకకు చెందిన వారే కావటం గమనార్హం. తెలంగాణను పది ఏఐసీసీ క్లస్టర్లుగా విభజిస్తే, ఆ పదింటికీ కర్ణాటక మంత్రులను ఇన్చార్జీలుగా నియమించడం గమనార్హం. ఏఐసీసీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలుగా మొదటి జాబితాలో 48 మందిని ప్రకటిస్తే అందరూ కర్ణాటకకు చెందినవారే ఉన్నా రు. వీరిలో 25 మందికి పైగా కర్ణాటక ఎమ్మెల్యేలు ఉంటే మిగిలినవారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు, ఇతర నేతలు ఉన్నారు. మిగిలిన స్థానాల జాబితాలోనూ ఇన్చార్జీలుగా కర్ణాటకకు చెందిన వారు ఎంతమంది ఉండనున్నారనేది జాబితా విడుదలైతేగానీ చెప్పలేం. మునుపెన్నడూలేని విధంగా బెంగళూరు వేదికగా రాజకీయ వ్యూహరచన, నిధుల సమీకరణ.. దీనికి తోడు కర్ణాటక ప్రజాప్రతినిధులనే ఇక్కడ భారీఎత్తున మోహరించటం అనుమానాలకు కొండంత బలాన్ని చేకూరుస్తున్నాయి.
బెంగళూరు నుంచే..
సాధారణంగా ఎన్నికలు రాగానే జాతీయ పార్టీలు ఢిల్లీ వైపు చూస్తాయి. ఆ పార్టీల నాయకులు ఢిల్లీలో ఎక్కిన గడప… దిగిన గడప… అన్నట్లుగా టికెట్ల కోసం పైరవీలు చేసుకుంటారు. రాజకీయ వ్యూహాలు, ఇతరత్రా సమీకరణలన్నీ దేశ రాజధానిలోనే రూపొందిస్తారు. కానీ తాజాగా తెలంగాణ ఎన్నికల ముఖచిత్రంలో కాంగ్రెస్ వైఖరి విచిత్రంగా… ఒకరకంగా ఆందోళనకరంగా తయారైంది. కేవలం తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కాదు.. చివరకు ఢిల్లీ జాతీయ నేతలు సైతం బెంగళూరు వైపు మాత్రమే చూస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ తన కార్యకలాపాలను ఎక్కడ నుంచి కొనసాగించాలనేది దాని ఇష్టం. ఇందులో ఎవరికీ పెద్ద అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే… తెలంగాణ గుండెకాయలాంటి హైదరాబాద్ భవిష్యత్తును పణంగా పెట్టి బెంగళూరు వేదికగా సాగుతున్న హస్తంపార్టీ కుట్రలు అందరిలోనూ తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది.
ఇన్చార్జి కన్నడ మంత్రులు వీరే..
కోట్ల కట్టల కథ ఇది!