హైదరాబాద్, జనవరి3 (నమస్తే తెలంగాణ): కేస్లాపూర్ నాగోబా జాతర నిర్వహణకు నిధులు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కకు మెస్రం వంశస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జుతో కలిసి సచివాలయంలో భట్టికి వినతిపత్రం అందజేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా నాగోబా ఆలయాన్ని సందర్శించిన భట్టి ఇచ్చిన హామీలు తీర్చాలని కోరారు. ఆదివాసీల సమస్యలను పరిషరిస్తామని, నాగోబా ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.