హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి తెలంగాణ మున్సిపల్ చైర్మన్ చాంబర్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని అధ్యక్షుడు వెన్రెడ్డి రాజు వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ చాంబర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా వెన్రెడ్డి రాజు మాట్లాడుతూ.. భారత రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ మరో విప్లవం సృష్టించబోతున్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో మున్సిపల్ చైర్మన్లు పర్యటించి తెలంగాణలో చేపట్టిన పథకాలపై విస్తృత ప్రచారం చేస్తామని, కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు మున్సిపల్ చాంబర్ కృషి చేస్తుందని రాజు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎడ్మ సత్యం, ఉపాధ్యక్షురాలు మంజుల, మున్సిపల్ చైర్మన్లు ఈశ్వర్, శ్వేత, సద్దాం హుస్సేన్, అర్చన, జమున, స్రవంతి, స్వప్న, నరేందర్ పాల్గొన్నారు.