జగిత్యాల : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంజూరు చేసిన 14 వైద్య కళాశాలలన్నింటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. నర్సింగ్ కాలేజీలకు సైతం పూర్తిస్థాయి బోధన, బోధనేతర పోస్టులను మంజూరు చేశామని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి తెలిపారు.
జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ కోసం కేటాయించిన స్థలంతో పాటు, జగిత్యాల జిల్లా ప్రధాన దవాఖాన, మాతా శిశు సంరక్షణ కేంద్రం, నర్సింగ్ కాలేజీ భవనాలను డాక్టర్ రమేశ్రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, పబ్లిక్ హెల్త్ సీఎం ఓఎస్డీ డాక్టర్ తుమ్మనపల్లి గంగాధర్, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు.
అనంతరం వైద్య కళాశాల స్థలం, ఇతర మౌలిక వసతుల విషయమై కలెక్టర్ గుగులోత్ రవితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. జగిత్యాల మెడికల్ కాలేజీలో 2022-2023 విద్యా సంవత్సరం నుంచి బోధన ప్రారంభమవుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒకేసారి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, వైద్య విద్యాబోధన రెండు ప్రారంభిస్తున్నామన్నారు.
రాష్ట్ర రాజధాని, ఇతర ప్రధాన నగరాలకు దూరంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మెడికల్ కాలేజీలతో పాటు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను సైతం కాలేజీలతో పాటే ప్రారంభించాలని ఆదేశించారని పేర్కొన్నారు. పేషెంట్ ఔటాఫ్ది ప్యాకెట్ పద్ధతిలో రోగికి నయా పైసా లేకుండా వైద్య సేవలు, చేరువగా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో దేశంలోనే తొలిసారిగా మెడికల్ కాలేజీతో పాటు, 650 బెడ్స్తో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే దవాఖానను ప్రారంభించనున్నామన్నారు. దవాఖాన కోసం జగిత్యాలలో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ సహజంగా వైద్యుడు కావడంతో ఆయనకు ఉన్న అవగాహనతో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారికి సమీపంలో 27 ఎకరాల స్థలాన్ని కేటాయింపజేశారన్నారు.
ఇప్పటికే మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మించారని, దీన్ని వినియోగించుకుంటామన్నారు. అలాగే మరో కొన్ని భవనాలను సైతం పరిశీలించామని, వాటిని సైతం వినియోగించుకొని వచ్చే విద్యా సంవత్సరం నుంచి వైద్య కళాశాల, వైద్యశాల సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే ఏడాది 150 వైద్య విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తారన్నారు.
సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జగిత్యాల ప్రధాన దవాఖాన పర్యవేక్షకురాలు డాక్టర్ సుదక్షిణాదేవి, జగిత్యాల ప్రధాన వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం..వృద్ధురాలికి చేయూత
Ind vs Eng | ఇంగ్లండ్ గెలుస్తుందా? చేజింగ్లో ఆ టీమ్ రికార్డేంటి? ఓవల్ పిచ్ ఎలా ఉంది?
కందకుర్తి వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం