హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి సహా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ దేశానికే మారదర్శనం చేస్తున్న తెలంగాణను ఎలాగైనా ఇరుకున పెట్టాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం అందుకు విద్యుత్తు అంశాన్ని అస్త్రంగా వాడుకున్నది. మహ్రాపభో మేము బకాయిలు చెల్లించేశాము అని తెలంగాణ విద్యుత్ సంస్థలు మొత్తుకున్నా వినకుండా.. ఎన ర్జీ ఎక్సేంజ్కు బకాయిలు చెల్లించలేదన్న నింద మోపి విద్యుత్తు కొనుగోలు, అమ్మకాలపై నిషేధం విధించింది. తెలంగాణకు విద్యుత్తు అందకుండా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చులకన చేసేందుకు కుట్ర పన్నింది. కేంద్రం ఎన్ని కుయుక్తులు పన్ని నా తెలంగాణకు ప్రకృతి అండగా నిలిచింది. శుక్రవారం కరెంటు సరఫరాలో ఎటువంటి లోటు రాకుండా చూశాయి.
రాత్రికి రాత్రి బకాయి తగ్గిపోయింది!
ప్రాప్తి పోర్టల్లో ఈ నెల 18న పొందుపరిచిన సమాచారం ప్రకారం తెలంగాణ విద్యుత్తు సంస్థలు కేంద్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు రూ.1380.96 కోట్లు బాకీ ఉన్నట్టు పేర్కొన్నారు. అందువల్ల విద్యుత్తు కొనుగోలు చేయకుండా నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర విద్యుత్తుశాఖ ఉన్నతాధికారులు తాము రూ.1360 కోట్లు చెల్లించామని అదేరోజు కేంద్ర సంస్థలకు తెలియజేశారు. అయినప్పటికీ నిషేధం విధించారు.వాస్తవాన్ని గ్రహించిన కేంద్ర సంస్థలు శుక్రవారం ఉదయానికల్లా తమ తప్పును సరిదిద్దుకున్నాయి. తెలంగాణ విద్యుత్తు సంస్థలు కేవలం రూ.52.85 కోట్లు బకాయి ఉన్నట్టు తమ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. ఇది కూడా అబద్ధమేనని, తాము చెల్లించాల్సిన బకాయి ఇంకా తక్కువేనని అధికారులు అంటున్నారు.
ఆదుకున్న థర్మల్, హైడల్, సోలార్!
రాష్ట్రంలో శుక్రవారం 12,119 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైనా.. థర్మల్, జల విద్యుత్తును పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తేవడం, మధ్యాహ్నానికి సౌర విద్యుత్తు అందుబాటులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు సరఫరాలో ఎటువంటి అంతరాయం ఏర్పడలేదు. కృష్ణా నదికి వరద రావడంతో.. గరిష్ఠంగా జల విద్యుత్తు అందుబాటులోకి వచ్చింది. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ప్రకృతి తెలంగాణకు అండగా నిలిచిందని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్తు సరఫరాలో వినియోగదారులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
ఇలా చేయడం బాధాకరం
కేంద్ర ప్రభుత్వం నోటీసు ఇవ్వకుండానే విద్యుత్తు కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చారు. రూ. 1360 కోట్లు బకాయిలు కట్టినప్పటికీ.. ఇలా చేయడం బాధాకరం. మనం పేమెంట్ చేసినా.. ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. పవర్ ఎక్సేంజ్పై ఇవాళ సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. రాష్ట్రంలో వర్షాలు బాగా పడటంతో జల విద్యుత్తును పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం. రైతులు, వినియోగదారులు ఎక్కడైనా విద్యుత్తు సరఫరాలో అంతరాయం వస్తే మాతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– దేవులపల్లి ప్రభాకర్రావు సీఎండీ