హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మానవ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేయకుండా వాటికి శాస్త్రీయ పరిష్కారాన్ని చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖించనున్నది. వాటి ప్రాసెసింగ్కు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)లను వినియోగించి ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలపనున్నది. ఇందుకోసం రూ.428.06 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 139 ఎఫ్ఎస్టీపీలను నిర్మిస్తున్న ప్రభుత్వం.. ఈ ఏడాది మే చివరి నాటికి వీటినిపూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
2018లోనే ఎఫ్ఎస్ఎంఎం పాలసీ
బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జనను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నప్పటికీ వాటి నిర్వహణను గాలికి వదిలేస్తున్నది. ముఖ్యంగా మానవ వ్యర్థాల ప్రాసెసింగ్కు సరైన పరిష్కారాన్ని చూపకపోవడం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. దీన్ని గుర్తించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. మానవ వ్యర్థాల ప్రాసెసింగ్కు శాస్త్రీయ పరిష్కారాన్ని చూపుతూ 2018లోనే ఫీకల్ స్లడ్జ్ అండ్ సిప్టేజ్ మేనేజ్మెంట్ (ఎఫ్ఎస్ఎస్ఎం) పాలసీని తీసుకొచ్చారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో తొలి విడతగా రూ.250.73 కోట్లతో 71, రెండో విడతలో రూ.177.33 కోట్లతో మరో 68 ఎఫ్ఎస్టీపీల నిర్మాణం చేపట్టారు. వీటిలో ఇప్పటికే 21 పూర్తయ్యాయి. మరో 14 ఎఫ్ఎస్టీపీల పనులు తుది దశకు చేరాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
వాహనాలపై నిఘా
తెలంగాణలో ప్రతి సెప్టిక్ ట్యాంకును మూడేండ్లకోసారి క్లీన్ చేయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి నుంచి వచ్చే వ్యర్థాలను ఎఫ్ఎస్టీపీలకు మాత్రమే తరలించాలని ట్యాంకు క్లీనర్లను ఆదేశించింది. ఈ ఆదేశాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఇప్పటికే అన్ని ట్యాంకర్లను రిజిస్టర్ చేయించడంతోపాటు వాటికి జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేసింది. దీంతో రోజూ ఎన్ని ట్యాంకులను క్లీన్ చేస్తున్నారు, వ్యర్థాలను ఎక్కడ పోస్తున్నారు అన్నదానిపై మున్సిపాలిటీలు పర్యవేక్షణ జరిపి, వ్యర్థాలను ఎఫ్ఎస్టీపీలకు తరలించనివారిపై కఠిన చర్యలు చేపడుతున్నాయి.
ప్రాసెసింగ్ ఇలా..
ఎఫ్ఎస్టీపీలకు తీసుకొచ్చిన మానవ వ్యర్థాలను థర్మల్ సిస్టంలో వేడిచేసి పొడిగా మార్చడంతోపాటు పాథోజన్స్, క్రిమికీటకాలు లేకుండా చేసి ఎరువుగా మారుస్తారు. ఎన్జీటీ ప్రమాణాలకు అనుగుణంగా జరిగే ఈ ప్రక్రియలో ఎక్కడా దుర్వాసనకు ఆస్కారం లేకుండా చూసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.
ఇంకా మేలుకోని కేంద్రం
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మానవ వ్యర్థాల సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో మేలుకోలేదు. సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేయించేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నప్పటికీ వాటి నుంచి వచ్చే వ్యర్థాలను ఎక్కడ పోయాలనే దానిపై ఆలోచించలేదు. పీపీఈ కిట్లు, సరైన రక్షణ చర్యలు లేకుండా సెప్టిటిక్ ట్యాంకుల్లోకి దిగడంతో ఉత్తర్ప్రదేశ్లో 51, తమిళనాడులో 48, ఢిల్లీలో 44, హర్యానాలో 36, గుజరాత్లో 28, కర్ణాటకలో 26 మంది సఫాయి కార్మికులు చనిపోయినట్టు ఇటీవల పార్లమెంట్లో స్వయంగా కేంద్రమే వెల్లడించింది.
నిర్మాణం పూర్తయినవి
ఐజ, గద్వాల, మహబూబ్నగర్, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిర్మల్, నిజామాబాద్, మేడ్చల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, షాద్నగర్, భువనగిరి, మీర్పేట, బడంగ్పేట, ఖమ్మం, నల్లగొండ, చెన్నూరు.
నిర్మాణం తుది దశలో ఉన్నవి నారాయణపేట, నాగర్కర్నూల్, గజ్వేల్, భూపాలపల్లి, రామగుండం, వేములవాడ, మెట్పల్లి, ఆర్మూర్, భైంసా, బోధన్, దుబ్బాక, సదాశివపేట, ఇల్లందు, సూర్యాపేట.