హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఈ సారి రాష్ట్రంలో భారీగా లోక్సభ సీట్లు గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి నేతల అసమ్మతి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. పైకి అంతా బాగుందన్నట్టుగా వ్యవహరిస్తున్నా.. మెజార్టీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి.
రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మొదలుకొని.. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఏం చేయాలో తెలియక రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నది. అన్నింటికంటే ముఖ్యంగా రాజాసింగ్ వ్యవహారం తలనొప్పిగా తయారైంది. డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి మొదలు రాజాసింగ్ బీజేపీ నాయకత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి దక్కకపోవడంతో ఆయన అలకపాన్పు ఎక్కిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎంత మంది నేతలు సముదాయించినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించడంతో ఆయన అసంతృప్తి తారస్థాయికి చేరింది. ఏకంగా ‘అభ్యర్థిగా మగవాళ్లే దొరకలేదా?’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల రాష్ట్ర లోక్సభ ఎన్నికల ఇంచార్జి అభయ్ పాటిల్, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కలిసి రాజాసింగ్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్ నియోజవర్గాల్లో రాజాసింగ్ సేవలు వాడుకోవాలన్న బీజేపీ అధిష్ఠానం ప్లాన్ ఫెయిల్ అయ్యింది.
ఎక్కడికక్కడ సీనియర్ల గుర్రు
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని ఉన్నామని, పదవుల పరంగా ఎదగలేదని, ఆర్థికంగా ఎదగలేదని, కొత్తగా వచ్చిన నేతలకు అవకాశాలు ఇస్తూ తమను దూరం పెడుతున్నారని అలకబూనినట్టు చర్చ జరుగుతున్నది. ‘పార్టీలు మారుతూ ఉంటే మేము కూడా సంపాదించేవాళ్లం.. డబ్బు కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేయడమే మేం చేసిన పాపమా?’ అని వాపోతున్నట్టు తెలిసింది.
అందుకే కొందరు ఎన్నికల ప్రచారంలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇక మల్కాజిగిరి టిక్కెట్ను ఈటల రాజేందర్కు ప్రకటించగానే.. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. మల్కాజిగిరిలో సీనియర్ నేత మురళీధర్ రావు సైతం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. తాజాగా కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్లో చేరారు.
మల్క కొమురయ్య, వీరేందర్ గౌడ్, సురేశ్ రెడ్డి, సామ రంగారెడ్డి.. తదితర నేతలంతా అసంతృప్తితో ఉన్నారు. మహబూబ్నగర్ టిక్కెట్ ఏకంగా పార్టీలో చిచ్చు పెట్టింది. డీకే అరుణకు కేటాయించగానే జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. నల్గొండ పార్లమెంట్ బీజేపీ టిక్కెట్ను శానంపూడి సైదిరెడ్డికి ఇవ్వొద్దని నల్గొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు ఏకంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు.
జహీరాబాద్ నుంచి మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్రెడ్డి, ఆలె నరేంద్ర కుమారుడు ఆలె భాస్కర్ వంటి నేతలను కాదని బీఆర్ఎస్ నుంచి బీబీపాటిల్ను అప్పటికప్పుడు చేర్చుకొని టిక్కెట్ ఇవ్వడం అసంతృప్తికి దారి తీసింది. నాగర్కర్నూల్లో ఢిల్లీకి వెళ్లి కండువా కప్పుకున్న మరుక్షణమే భరత్కు కేటాయించడంతో ఆ సీటు ఆశించిన బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి కొన్నాళ్లపాటు సైలెంట్ అయిపోయారు. మెదక్ నుంచి రఘునందన్ రావుకు టిక్కెట్ ఇవ్వడంతో సీనియర్ నేతలకు అవకాశం ఇవ్వకుండా ఓడిపోయిన నేతకు ఎలా టిక్కెట్ ఇస్తారనే చర్చ మొదలైంది.
నిజామాబాద్లో ధర్మపురి అర్వింద్ నోటి దురుసుపై సీనియర్లు ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్నారు. మండలాధ్యక్షుల మార్పు వివాదం గతంలో రాష్ట్ర కార్యాలయంలో బైఠాయించే స్థాయి దాకా చేరిన సంగతి తెలిసిందే. వారంతా ఇప్పుడు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉన్నదని చర్చ జరుగుతున్నది.
కరీంనగర్లో బండి సంజయ్ ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడంపైనా నేతలు అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వేరే వారికి అవకాశం ఇస్తే ఏమయ్యేదని అంతర్గతంగా చర్చ జరుగుతున్నదని సమాచారం. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోనూ తమను కలుపుకొని పోవడం లేదని కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది.
ఆదిలాబాద్లో సోయం బాపూరావును పక్కనబెట్టడంపైనా వివాదం చెలరేగుతున్నది. ఇలా ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతుండటంతో రాష్ట్ర నాయకత్వం కూడా క్రమంగా చేతులెత్తేస్తున్నట్టు తెలుస్తున్నది. నేతల బుజ్జగింపుల బాధ్యతను ఆయా అభ్యర్థుల మీద వదిలేసినట్టు చర్చ జరుగుతున్నది.