హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): చట్టపరమైన సాక్ష్యాధారాలు లేకుండా బ్యాంక్ ఖాతా స్తంభింపజేయడం చెల్లదని హైకోర్టు స్పష్టంచేసింది. నేరాభియోగానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఏకపక్షంగా ఖాతాను స్తంభింపజేయడం వ్యాపార, వాణిజ్య ప్రాథమిక హకులను ఉల్లంఘించడమే కాకుండా, జీవనోపాధిని కూడా దెబ్బతీయడం అవుతుందని తేల్చి చెప్పింది.
యాంత్రికంగా ఖాతాను స్తంభింపజేయడం జీవించే హకుతోపాటు అధికరణం 19(1)(జే) ప్రకారం వ్యాపార, వాణిజ్యం చేసుకునే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని తీర్పు చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లా సైబర్ క్రైమ్ విభాగం ఆదేశాల మేరకు ఒక ప్రైవేట్ బ్యాంకులోని తమ ఖాతాను స్తంభింపజేయడం అన్యాయమంటూ ఖమ్మంకు చెందిన ది బాటిల్ రెస్టారెంట్ అండ్ బార్ యజమాని కందిబండ శ్రీధర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ పూర్తి చేసిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ పై తీర్పు వెలువరించారు. తక్షణమే బ్యాంక్ ఖాతాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఆదేశించారు.