హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హరితహారంలో భాగంగా ఈ నెల 10న అన్ని చోట్లా మొక్కలు నాటాలని, ఫ్రీడమ్ ప్లాంటేషన్స్ను పెద్ద ఎత్తున నిర్వహించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ ఎం డోబ్రియల్ ఆదేశించారు. తెలంగాణకు హరితహారం, ఎనిమిదో విడత పురోగతిపై ఆయన గురువారం అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా హరితహారం లక్ష్యం, ఇప్పటివరకు సాధించిన ప్రగతిపై ఆరా తీశారు.
భారీ వర్షాల కారణంగా ఆగిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని చెప్పారు. వీలైనంత త్వరగా హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ప్రతీ గ్రామ పంచాయతీ నర్సరీల్లో తప్పనిసరిగా కనీసం వెయ్యి నుంచి ఐదు వేల పెద్ద మొకల పెంపకానికి చర్యలు చేపట్టాలన్నారు. హరితహారం మొకల పర్యవేక్షణకు వాచ్ అండ్ వార్డ్ ఏర్పాటు చేయాలని డోబ్రియల్ సూచించారు.