హైదరాబాద్: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్ ఆర్టీసీ ఉచిత రవాణ సదుపాయం కల్పిస్తున్నది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది.
పరీక్ష జరగనున్న హైదరాబాద్ జంట నగరాలు, వరంగల్లోని మెట్రో, ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించ వచ్చని వెల్లడించింది. అంతేకాకుండా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ -2021కి హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ శుభాకాంక్షలు తెలిపింది.