హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): పుట్టుకతోనే ‘బిలియరీ అట్రేజియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి కిమ్స్ వైద్యులు నిర్వహించిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు కిమ్స్ కాలేయ మార్పిడి విభాగాధిపతి డాక్టర్ రవిచంద్ సిద్ధాచారి వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా తిరుమలగిరికి చెందిన నిరుపేద తల్లిదండ్రులు 2 నెలల క్రితం 7 నెలల చిన్నారిని తీసుకొని కిమ్స్కు వచ్చినట్టు తెలిపారు. పుట్టిన నెల రోజులకే కామెర్లు రావడంతో పలు దవాఖానల్లో చికిత్స చేయించారని, అయినా ఫలితం లేకపోవడంతో కిమ్స్ను ఆశ్రయించారని పేర్కొన్నారు. అప్పటికే కాలేయం విఫలమవుతున్న లక్షణాలు చిన్నారిలో కనిపించాయని, మలంలో రక్తం పోవడం మొదలైనట్టు గుర్తించామని తెలిపారు. చిన్నారికి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు నిర్వహించగా, ‘బిలియరీ అట్రేజియా’గా నిర్ధారణ అయ్యిందని వివరించారు. వ్యాధి ముదిరిన దశకు చేరడంతో కాలేయ మార్పిడి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
తల్లి నుంచి కొంత కాలేయ భాగాన్ని తీసి చిన్నారికి అమర్చినట్టు డాక్టర్ రవిచంద్సిద్ధాచారి తెలిపారు. సాధారణంగా ఈ శస్త్రచికిత్సకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని, చిన్నారి తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో కిమ్స్ యాజమాన్యం శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించిందని పేర్కొన్నారు. 2020, నవంబర్లో ఫిలిపీన్స్ దేశానికి చెందిన ఒక చిన్నారికి కూడా ఇదే సమస్య తలెత్తడంతో, వారు మన దేశానికి వచ్చి కిమ్స్లో చికిత్స తీసుకొన్నట్టు చెప్పారు. ‘బిలియరీ అట్రేజియా’ అనేది పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే కాలేయ వ్యాధి. ఇది సోకిన పిల్లల్లో పిత్తనాళం ఉండదు. అంటే పిత్తనాళం రూపొందదు. దేశంలో ప్రతి 20 వేల మంది పిల్లల్లో ఒకరికి ఈ సమస్య కనిపిస్తున్నది.
సమస్యను సకాలంలో గుర్తిస్తే వారికి కాలేయ మార్పిడి అవసరం ఉండదు. పోర్టో ఎంటెరోస్టమీ లేదా కసాయి ప్రొసీజర్ ద్వారా చికిత్స చేయవచ్చంటున్నారు డాక్టర్ రవిచంద్ సిద్ధాచారి. వ్యాధిని 3 నెలలు దాటి గుర్తిస్తే కాలేయం సెకండరీ బిలియరీ సిరోసిస్కు గురవుతుందని, ఆ దశలో కాలేయ మార్పిడి తప్పదని వివరించారు. పిల్లలకు జరిగే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల్లో 50 శాతం ‘బిలియరీ అట్రేజియా’ వ్యాధే కారణమని చెప్పారు.