హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉచిత బియ్యం పంపిణీ పథకం మరో మూడు నెలలపాటు కొనసాగనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల నుంచి డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాలశాఖ వెల్లడించింది. ఈ నెల ఉచిత బియ్యం పంపిణీని గురువారం నుంచి ప్రారంభించారు. ప్రతి వ్యక్తికి 10 కిలోల చొప్పున అందజేయన్నారు. రాష్ట్రంలోని 2.83 కోట్ల మంది తెల్లరేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరనున్నది. రాష్ట్రంలో మొత్తం 90.01 కోట్ల తెల్ల రేషన్కార్డులుండగా, ఇందులో కేంద్రం కేవలం 54.37 లక్షల కార్డులకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది. వీరికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నది.
మిగిలిన 35.64 లక్షల కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఉచిత బియ్యం పంపిణీని మరో మూడు నెలలపాటు పొడిగించడంతో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.227.25 కోట్లు వెచ్చించనున్నది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ప్రారంభమైన 2020 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీని కొనసాగిస్తుండటం గమనార్హం. ఇందుకోసం రూ.1,308 కోట్లు ఖర్చు చేసింది. వలసకూలీలకు రూ.500 ఆర్థిక సాయంతోపాటు ఉచిత బియ్యం పంపిణీ చేసింది. అదే విధంగా కరోనా కష్టకాలంలో ప్రతి తెల్లరేషన్ కార్డుదారునికి రూ.1500 చొప్పున రెండు నెలలు అందజేసింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,454 కోట్లు వెచ్చించింది.
రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదన్నది సీఎం కేసీఆర్ ఆశయం. అందుకే ఆర్థికంగా భారమైనప్పటికీ రెండున్నరేండ్లుగా తెల్లరేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరో మూడునెలలపాటు బియ్యం పంపిణీని పొడిగించినందుకు పేదల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి