హైదరాబాద్ : కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు కడుపునిండా భోజనం అందించాలన్న సదుద్దేశంతో ప్రతి రేషన్కార్డుదారుడికి ఉచితంగా 20 కిలోల బియ్యం ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 4వ తేదీ లోగా గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యాన్ని వేగంగా తరలించాలని చెప్పారు.
ఉచిత బియ్యం పంపిణీపై పౌరసరఫరాల భవన్లో పిడిఎస్ విభాగం అధికారులతో మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ ఉషారాణి, డిప్యూటీ కమిషనర్ పద్మజ, అసిస్టెట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ రాజారెడ్డి, పిడిఎస్ డిప్యూటీ మేనేజర్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆశించిన స్థాయిలో బియ్యం రవాణా జరగడం లేదని, రవాణాలో ఎందుకు జాప్యం జరుగుతోందని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. వేల కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయినప్పటికీ రవాణాలో జాప్యం సరికాదన్నారు. ఈ బియ్యం కోసం పేదలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు తీసుకురావద్దన్నారు. ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లతో మాట్లాడి అదనపు వాహనాలను సమకూర్చుకుని రవాణాను వేగవంతం చేయాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలను జాయింట్ కమిషనర్ పర్యవేక్షించాలని, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలను డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షించాలని సూచించారు. బియ్యం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. ఉచిత బియ్యం పక్కదారి పట్టకుండా అర్హులైన పేదలకు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ నెల 5వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్షాపుల వద్ద ఎక్కువ మొత్తం లబ్ధిదారులు గుమికూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి లబ్ధిదారుడికి బియ్యం అందిస్తామని ఎవరూ ఎలాంటి అందోళన చెందకుండా క్రమపద్ధతితో వచ్చి రేషన్ తీసుకోవాలని లబ్ధిదారులకు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
బియ్యం పంపిణీ చేశాక మిగిలిన గన్నీ సంచులను తప్పని సరిగా పౌరసరఫరాల సంస్థకు విక్రయించాలని రేషన్ డీలర్లను మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. జూన్లో ఉచిత బియ్యం పంపిణీ వల్ల 80 లక్షల గన్నీ సంచులు డీలర్ల దగ్గర మిగిలిపోనున్నాయని, ఈ గన్నీ సంచులను పౌరసరఫరాల సంస్థకు విక్రయించేలా అదనపు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నుండి ఒక్కో గన్నీ సంచి ధరను రూ.18 నుండి రూ.21కి పెంచడం జరిగింది. రేషన్ డీలర్లు గన్నీ సంచులను పౌరసరఫరాల సంస్థకు అప్పగించిన తరువాత వారం రోజుల్లో చెల్లింపులు జరపాలని జిల్లా మేనేజర్లను శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.