హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, సంక్రాంతి లోపు లబ్ధిదారులను ఎంపిక చేసి అప్పగించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, గృహ నిర్మాణశాఖ కార్యదర్శి సునీల్శర్మతో కలిసి మంత్రి కలెక్టర్లు, ఆర్అండ్బీ అధికారులతో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిస్థితి, నిర్మాణాలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైసాభారం పడకుండా పేదలకు చక్కటి ఇండ్లు నిర్మించి ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఎకడా లేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.91 లక్షల ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.18 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇప్పటికే 1.29 లక్షల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా, 62 వేల ఇండ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. మిగతావన్నీ వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. డబుల్ ఇండ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, జనవరి 15 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని.. దారిద్య్రరేఖకు దిగువన ఉండి, తెల్లరేషన్ కార్డు కలిగి, కిరాయి ఇండ్ల లో ఉంటున్నవారే అర్హులని మంత్రి స్పష్టం చేశారు. వార్డు, గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే అర్హుల జాబితాను పంపించాలని సూచించారు. ఇండ్ల సంఖ్య కంటే అర్హులు ఎక్కువ ఉంటే లకీడ్రా ద్వారా ఎంపిక చేయాలని, మిగిలిన వారిని వెయిటింగ్ లిస్ట్లో పెట్టాలన్నారు. సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతి వారం కలెక్టర్లు సమీక్షించాలని, ఎమ్మెల్యేలతో మాట్లాడి సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
పోడుభూముల సర్వే పూర్తి చేయాలి
డబుల్ ఇండ్లపై సమీక్ష అనంతరం పోడు భూములు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలు, ధరణి, నేషనల్ హైవేల భూసేకరణ అంశాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26లోపు పోడు భూముల సర్వే పూర్తి చేసి గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలను సబ్ కమిటీకి పంపేలా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ధరణి ఫిర్యాదులు, జీవో 58, 59 సమస్యలను పరిశీలించి అర్హులైన వారి కి పట్టాలు ఇవ్వాలని సూచించారు.పెండింగ్ మ్యుటేషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
తుదిదశకు సచివాలయ పనులు
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకొన్నాయని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. గురువారం సీఎస్ సోమేశ్కుమార్తో కలిసి బీఆర్కే భవన్ 10వ అంతస్తు పైనుంచి వాటిని పరిశీలించారు. నూతన సచివాలయం, అమరవీరుల చిహ్నం, అంబేద్కర్ విగ్రహం పనులన్నీ సమాంతరంగా చేపట్టాలని, త్వరలో వీటి ప్రారంభోత్సవాలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.