Telangana | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్బుక్స్ ఉచిత పంపిణీ వారంలో ప్రారంభం కానున్నది. మంగళవారం నుంచి ఈ వర్క్బుక్లను ఆర్టీసీ కార్గో ద్వారా జిల్లాలకు చేరుస్తారు. అక్కడి నుంచి మండలాలకు, బడులకు పంపిస్తారు. మొత్తం మీద వారం రోజుల్లోనే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఈ వర్క్బుక్స్ను అందజేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల విద్యార్థులకు ఉచితంగా వర్క్బుక్స్, నోటుబుక్స్ ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. జూన్ 20న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 6 నుంచి10 తరగతుల విద్యార్థులకు నోట్బుక్లను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
11 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
ఎస్సీఈఆర్టీ నిపుణుల బృందం ప్రత్యేకంగా వర్క్బుక్స్ను ఆకర్షణీయంగా రూపొందించింది. పలు కృత్యాలను అంతర్భాగం చేర్చి తయారుచేసింది. వీటిని ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ ద్వారా మల్టీకలర్లను వినియోగించి ముద్రించారు. రాష్ట్ర సర్కారు బడుల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు 11 లక్షల మంది ఉండగా, వీరికి 33 లక్షల వర్క్బుక్లను అందజేస్తారు. ఒక్కో విద్యార్థికి మూడు చొప్పున వర్క్బుక్స్ ఇవ్వనుండగా, ఇందుకోసం ప్రభుత్వం రూ. 34.70 కోట్లు వెచ్చించింది.