హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): కష్టపడి సాధన చేస్తే సర్కారీ కొలువును సులువుగానే సాధించవచ్చని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, టీచర్ల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘కొలువు-గెలువు’ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కళామండపంలో 1200 మందితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చక్రపాణి మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రైవేటు కోచింగ్ తీసుకొనే స్థోమత లేనివారికి ఉచితంగా వసతి కల్పించి, శిక్షణ ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 200 కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు.
వాటిని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు ఉద్యోగార్థులకు ఉచిత భోజన సదుపాయం కల్పించి కోచింగ్ ఇప్పిస్తున్న ఘనత దేశంలో తొలిసారి తెలంగాణకు, సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశంసించారు. సమయం వృథా చేయకుండా సాధన కొనసాగించాలని, నిరంతరం సాధన చేస్తే విజయం తథ్యమని ఉద్యోగార్థులకు తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. పోటీ పరీక్షల ప్రిపరేషన్ పేరుతో అనారోగ్యానికి గురికావొద్దన్నారు. ఎంత సాధన చేసినా రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలని, ఇంటిలో వండిన ఆహారాన్నే తీసుకోవాలని సూచించారు.
సిలబస్లోని సబ్జెక్టులతోపాటు అన్ని అంశాలను విస్తృత కోణంలో చూడాలని, ఆ మేరకు మెటీరియల్ సేకరించి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సీబీఎస్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత పేర్కొన్నారు. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు సీఎస్ వేపా మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రామాణిక పుస్తకాలను అనుసరించడం ఉత్తమన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 80 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ కావడం చరిత్రలో ఇదే తొలిసారని, ఇది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని ‘నమస్తే తెలంగాణ’ వైస్ చైర్మన్ చిరంజీవి పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు పోటీపడుతున్న వారికి జిల్లాలవారీగా అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ‘తెలంగాణ టుడే’ ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి, ‘నమస్తే తెలంగాణ’ సర్క్యులేషన్ డీజీఎం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.