హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వస్తున్నదని, స్కీమ్ అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. పురుషులతో కలుపుకొంటే ప్రతి రోజూ 51 లక్షల మందిని ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చుతున్నదని, ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారని వివరించారు. మహిళలు కండక్టర్కు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు.
ఫొటో కాపీలు, స్మార్ట్ఫోన్లలో చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని తేల్చిచెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ సీమ్ వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని స్పష్టంచేశారు. జీరో టికెట్ల విషయంలో మహిళలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, జీరో టికెట్ను జారీచేస్తేనే ఆ చార్జీని ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని చెప్పారు. బస్సుల్లో వెనుక లాడర్ పైన ఎకి ప్రమాదకర రీతిలో ప్రయాణించడం సరికాదని, రద్దీ సమయాల్లో తమ సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులను కోరారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నాలుగైదు నెలల్లో 2,050 కొత్త బస్సులు విడతలవారీగా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఉచిత ప్రయాణ సీమ్ ఫలితంగా సంస్థ ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) గణనీయంగా పెరిగిందని తెలిపారు. గతంలో 69 శాతం ఓఆర్ ఉండగా.. ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగిందని తెలిపారు. ఈ నెల 16న 17 డిపోలు, 17న 20 డిపోలు, 18న 45 డిపోల్లో 100 శాతానికిపైగా ఓఆర్ నమోదైందని పేర్కొన్నారు. అతి తకువ టైంలోనే సీమ్ను అర్థంచేసుకొని విజయవంతంగా అమలు చేస్తున్న సిబ్బందిని ఆయన ప్రశంసించారు.