Free Bus For Women | ములుగు, జనవరి 17 (నమస్తేతెలంగాణ): మేడారం మహాజాతరకు వచ్చే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేసి భక్తు ల సౌకర్యార్థం అభివృద్ధి పనులను చేపట్టిందని అన్నారు. పనుల విషయంలో నాణ్యతపై రాజీపడేది లేదని స్పష్టం చేశారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడా రం గ్రామంలో మేడారం మహా జాతరపై వారు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముందుగా మేడారం సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించి పూజలు చేశా రు.
అనంతరం మంత్రు లు మీడియాతో మా ట్లాడుతూ.. మేడారం ప్రాంతంలో వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని, వాటి కోసం మేడారం నిధులతో అభివృద్ధి పనులు జరుపుతున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కోసం రూ.75 కోట్లు విడుదల చేయగా టెండర్ల ద్వారా పనులు చేపట్టినట్టు తెలిపారు. మరిన్ని నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరగా రూ.35 కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. శాశ్వత పనులు జరిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నదని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో కాంట్రాక్టర్లకు వంత పాడే అధికారులపై చర్యలు చేపడుతామని హెచ్చరించారు.