హైదరాబాద్, డిసెంబర్9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం(Free bus facility) మహిళలతో పాటు దివ్యాంగులకు(Disabled) కూడా వర్తింపజేయాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి(Vasudeva Reddy) కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
సమాజంలో మిగతా వర్గాల కంటే ఎకువగా దివ్యాంగులు వెనుకబడి ఉన్నారని, వారిని ఆదుకోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 6 లక్షల మంది వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని, వారికి ఇప్పటికే 50శాతం రాయితీతో బస్పాస్ సౌకర్యం ఉందని, వారికి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినట్లయితే వికలాంగులు మరింత ఎదగడానికి అవకాశముంటుందని తెలిపారు.
మహిళలతోపాటు వికలాంగులకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. దానివల్ల ప్రభుత్వానికి పెద్ద భారం కూడా పడదని, కావున మానవీయ కోణంలో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలతో పాటు దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.