హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): గ్రూప్స్ సహా ఇతర పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, తదితర నోటిఫికేషన్లతో పాటు గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో వీటిని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని గ్రంథాలయాల్లో ‘పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఎలా’ అన్న అంశంపై గ్రూప్ -1, గ్రూప్-2 అధికారులతో పాటు సబ్జెక్టు నిపుణులతో అభ్యర్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. సదస్సుల నిర్వహణపై శనివారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి, గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్తో తాము చర్చించినట్టు చంద్రశేఖర్గౌడ్ తెలిపారు. సదస్సులకు సహకరించాలన్న తమ వినతి మేరకు వారు సానుకూలంగా స్పందించి, అభినందించారని పేర్కొన్నారు.