Foxconn | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): యాపిల్ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ తెలంగాణ కేంద్రంగా వైర్లైస్ ఇయర్ఫోన్లతోపాటు ఇతర మొబైల్ ఫోన్ అనుబంధ వస్తువులను తయారు చేయనున్నది. తొలిదశలో కొంగరకలాన్ వద్ద రూ.1,653(200 మిలియన్ డాలర్లు)కోట్లకన్నా ఎక్కువ పెట్టుబడితో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టి, వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. తాజాగా యాపిల్ కంపెనీ నుంచి ఎయిర్పాడ్ల తయారీకి సంబంధించిన భారీ ఆర్డర్ను దక్కించుకున్న ఫాక్స్కాన్.. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న తయారీ కేంద్రం ద్వారా వాటి ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం యాపిల్ ఫోన్లలో 70శాతం ఫాక్స్కాన్ కంపెనీయే తయారుచేసి సరఫరా చేస్తుండటం విశేషం.
తైవాన్కు చెందిన దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. సంస్థ చైర్మన్ నేతృత్వంలోని కంపెనీ ఉన్నతస్థాయి ప్రతినిధిబృందం ఇటీవలే హైదరాబాద్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సమావేశమై రాష్ట్రంలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కాగా, కంపెనీ కోరిక మేరకు రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫాక్స్కాన్ కంపెనీ యాపిల్ కంపెనీ నుంచి ఎయిర్పాడ్ల తయారీ ఆర్డర్ను దక్కించుకుంది. ఇప్పటివరకు కేవలం ఫోన్లను మాత్రమే తయారుచేస్తున్న ఫాక్స్కాన్.. కొత్తగా ఎయిర్పాడ్ల తయారీలోకి అడుగుపెడుతున్నది. ఇంతకాలం చైనాకు చెందిన కంపెనీలు యాపిల్కు వైర్లెస్ ఇయర్ఫోన్లు, చార్జర్లు వంటివి సరఫరా చేస్తూ వచ్చాయి. చైనాలో కార్యకలాపాలను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్న యాపిల్.. భారత్లో తయారీని విస్తరించాలని నిర్ణయించుకున్నది. ఈ నేపథ్యంలో ఫాక్స్కాన్కు ఇయర్ఫోన్లు, ఇతర వస్తువుల తయారీ ఆర్డర్ను కట్టబెట్టడంతోపాటు.. భారత్లో తయారీ కేంద్రం ఏర్పాటుచేసి అక్కడినుంచే సరఫరా చేయాలని స్పష్టంచేసినట్టు రాయిటర్స్ మీడియా సంస్థ తెలిపింది. అయితే ఇయర్ఫోన్ల తయారీ అంత లాభసాటి కాదని ఫాక్స్కాన్ నిర్వాహకులు అంతర్గతంగా చర్చించుకున్నప్పటికీ.. చివరిగా యాపిల్తో తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునే ఉద్దేశంతో ఈ ఆర్డర్ను స్వీకరించినట్టు సమాచారం. అయితే ఫాక్స్కాన్కు దక్కిన ఈ ఎయిర్పాడ్ల తయారీ ఆర్డరు విలువ ఎంతో వెల్లడించేందుకు కంపెనీ వర్గాలు నిరాకరించాయని, యాపిల్ సంస్థ కోరిక మేరకే భారత్లో తయారీ కేంద్రాన్ని ఫాక్స్కాన్ ఏర్పాటు చేస్తున్నదని కంపెనీ వర్గాలను ఊటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.
ఫాక్స్కాన్తోపాటు తైవాన్కు చెందిన మరో రెండు కంపెనీలు విస్ట్రాన్ కార్పొరేషన్, పెగట్రాన్ కార్పొరేషన్ కూడా యాపిల్కు ఫోన్ యాక్సెసరీస్ తయారు చేస్తున్నప్పటికీ.. 70శాతం ఐఫోన్లు ఫాక్స్కాన్ నుంచే సరఫరా కావడం విశేషం. కొవిడ్ సందర్భంగా చైనాలో తలెత్తిన పరిణామాలు, కఠిన ఆంక్షల నేపథ్యంలో యాపిల్ ఫోన్ల సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. దీంతో యాపిల్కు ఫోన్లను సరఫరా చేస్తున్న కంపెనీలు చైనా నుంచి బయటికి వెళ్లాలని నిర్ణయించాయి. స్మార్ట్ఫోన్ల దిగ్గజ సంస్థ యాపిల్ సైతం తమ సరఫరాదారులను చైనా వెలుపలికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే ఫాక్స్కాన్ భారత్లో కార్యకలాపాలను విస్తరిస్తున్నది. అందుకు తెలంగాణను వేదికగా ఎంచుకున్నది.
ప్రస్తుతం చెన్నైలో ఫోన్ల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఫాక్స్కాన్ భారత్లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని నిర్ణయించిన సందర్భంలో దేశంలోని అనేక రాష్ర్టాలు ఫాక్స్కాన్ను తమ రాష్ర్టానికి రప్పించుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో కంపెనీ ప్రతినిధులు పలు ఇతర రాష్ర్టాలను కూడా సందర్శించారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రగతిశీల విధానాలు, స్నేహపూర్వక వాతావరణం, సులభతర విధానాలు ఫాక్స్కాన్ను అబ్బురపరిచాయి. అన్నిటికి మించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహారశైలి ఫాక్స్కాన్ ఛైర్మన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. దీంతో ఇతర రాష్ర్టాలను కాదని ఫాక్స్కాన్ భారత్లో తెలంగాణను తమ గమ్యస్థానంగా ఎంపిక చేసుకున్నది.
యాపిల్నుంచి ఇయర్ఫోన్ల తయారీ ఆర్డర్ లభించడంతోపాటు భారత్లో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటన అనంతరం ఫాక్స్కాన్ షేర్లు అమాంతం పెరిగాయి. కస్టమర్ల డిమాండ్కు అనుగుణంగా సరఫరాను వృద్ధి చేసేందుకు తమ తయారీని చైనా వెలుపల పెంచాలని నిర్ణయించినట్లు ఫాక్స్కాన్ వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ఎయిర్పాడ్లు సరఫరా చేస్తున్న చైనీస్ కంపెనీలు గోర్టెక్, లక్స్షేర్ ప్రెసిషన్ ఇండస్ట్రీలపై ఏ మేరకు ప్రభావం పడుతుందనేది తెలియాల్సి ఉన్నది.