హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఏపీ మర్కంటైల్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో ఆయన ఉన్నట్లు తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆయన్ను అరెస్టు చేశారు.
తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల బదలాయింపులో సత్యనారాయణ కీలక సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే యూనియన్ బ్యాంకు మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ సహకార సంఘం మేనేజర్ పద్మావతి, అదే సంస్థలో పనిచేసే ఉద్యోగి మొయినుద్దీన్ అరెస్టయ్యారు.
నలుగురు నిందుతులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. వీరంతా కలిసి అకాడమీకి చెందిన రూ. 60 కోట్ల ఎఫ్డీలను దారి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పత్రాలతో మర్కంటైల్ సహకార సంఘంలో ఖాతాలు సృష్టించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఖాతాల్లోకి యూబీఐ నుంచి నిధులు మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ నకిలీ ఖాతాలు సృష్టించడానికి సహకార సంఘం ఉద్యోగులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.