హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): బీటెక్ కోర్సుల తరహాలో దూర విద్యావిధానంలోనూ నాలుగేండ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టినట్టు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయ (ఇగ్నో) వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు చెప్పారు. ఈ విధానంలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో మొత్తం 19 రకాల కోర్సులను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ తాజాగా నాలుగేండ్ల దూర విద్యాకోర్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడిన ప్రొఫెసర్ నాగేశ్వర్రావు.. పరిశోధనల వైపు, విదేశీ విద్యనభ్యసించాలనుకొనే వారికి ఈ నాలుగేండ్ల డిగ్రీ కోర్సులు అనుకూలంగా ఉంటాయని వెల్లడించారు. వీసీ ఇంకా ఏం చెప్పారంటే..
జనవరి సెషన్లో ప్రవేశాలు..
ఇగ్నోలో దూరవిద్యతోపాటు పలు ఆన్లైన్ కోర్సులను నిర్వహిస్తున్నాం. మల్టీ డిసిప్లినరీ విధానంలో సైకాలజీ వంటి సబ్జెక్టులను కూడా విద్యార్థులు ఎంచుకోవచ్చు. నాలుగేండ్ల డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకొనే వారు ఈ జనవరి సెషన్ నుంచే ప్రవేశాలు పొందవచ్చు. దూరవిద్యతోపాటు ఆన్లైన్లోనూ ఈ కోర్సును పూర్తిచేయవచ్చు. స్వయం పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఈ కోర్సును పూర్తిచేయవచ్చు. జనవరి సెషన్ అడ్మిషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల వారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
8 సెమిస్టర్లు.. 160 క్రెడిట్లు
నాలుగేండ్ల డిగ్రీ కోర్సులో ఎనిమిది సెమిస్టర్లు, 160 క్రెడిట్లు ఉంటాయి. ఈ కోర్సులను మల్టీ డిసిప్లినరీ విధానంలో మేజర్, మైనర్ సబ్జెక్టులు తీసుకొని పూర్తిచేయవచ్చు. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, వొకేషనల్ విభాగాల్లో నాలుగేండ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాం. నాలుగేండ్ల డిగ్రీ పూర్తిచేసిన వారు ఏడాది వ్యవధిలోనే పీజీ పూర్తిచేసే అవకాశం ఉంటుంది. మొత్తం 160 క్రెడిట్స్ గల ఆనర్స్ డిగ్రీలో కోర్సులో రీసెర్చ్కు 40 మార్కులుంటాయి.
మధ్యలో ఆపేయవచ్చు
రెగ్యులర్ కోర్సుల తరహాలో మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ విధానాన్ని ఇగ్నోలోనూ అమలుచేస్తున్నాం. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ (ఎన్సీఆర్ఎఫ్) ప్రకారం విద్యార్థులు చదివిన చదువులు వృథా కాకుండా.. క్రెడిట్స్ ప్రకారం సర్టిఫికెట్లు జారీచేస్తాం. డిగ్రీలో చేరిన వారు తమకు ఎప్పుడు కావాలంటే అప్పడు చదువు మధ్యలో ఆపేయవచ్చు. డిగ్రీ ఫస్టియర్ తర్వాత ఆపేస్తే సర్టిఫికెట్, సెకండియర్ తర్వాత ఆపేస్తే డిప్లొమా, మూ డేండ్లు పూర్తిచేస్తే డిగ్రీ, నాలుగేండ్లు పూర్తిచేస్తే ఆనర్స్ డిగ్రీ జారీచేస్తాం. ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ మీడియంలో కోర్సులను ని ర్వహిస్తున్నాం. ఎన్ఈపీ ప్రకారం ప్రాంతీ య భాషల్లోనూ కోర్సుల నిర్వహణకు ఏర్పా ట్లు చేస్తున్నాం. మార్కెట్ అవసరాలకు తగినట్టుగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్ర వేశపెడుతున్నామని వివరించారు.
ఫీజు తక్కువ ప్రయోజనాలెక్కువ
దూరవిద్యకు హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దిక్సూచి వంటిది. తెలుగు వ్యక్తి బీఆర్ఏఓయూ వ్యవస్థాపకులైన ప్రొఫెసర్ జీ రాంరెడ్డి ఇగ్నో రీజినల్ సెంటర్ను ప్రారంభించారు. ఆయన బాటలోనే ఇగ్నోను ముందుకు తీసుకెళ్తున్నాం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్లు మాత్రమే ఉన్నత విద్యలో నమోదును (గ్రాన్ ఎన్రోల్మెంట్ రేషియో) పెంచగలవు. దేశవ్యాప్తంగా ఓపెన్ వర్సిటీలు ఇప్పటికే ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. అనేక మంది పేద, అణగారిన విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నాయి. దూరవిద్యలోని కోర్సుల ఫీజు తక్కువగా.. ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మూడేండ్ల బీఏ కోర్సు ఫీజు ఏడాదికి రూ.4,400 మాత్రమే. ఆనర్స్ డిగ్రీ కోర్సు ఫీజులు రూ.4,900గా తీసుకుంటున్నాం.