హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన నలుగురు స్ఫూర్తిదాయక మహిళలకు నీతిఆయోగ్ ఐదోఎడిషన్ ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డులు దక్కాయి. దేశాన్ని ‘సశక్త్ ఔర్ సమర్థ్’గా మార్చడంలో వీరు పోషిస్తున్న కీలక పాత్ర, విశేష విజయాలకు గుర్తింపుగా వివిధ రంగాలకు చెందిన 75 మంది మహిళలకు అవార్డులను ఇస్తున్నట్టు నీతిఆయోగ్ తెలిపింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా వీటిని అందజేస్తున్నట్టు వెల్లడించింది.
విజయ స్విత, హైదరాబాద్ : తెలంగాణలోని చేతివృత్తుల వారితో కలిసి పనిచేయడానికి విజయ స్విత ‘చిత్రిక’ పేరుతో సంస్థను ప్రారంభించారు. చేతివృత్తుల మహిళలు ఆదాయ స్థాయిలను పెంచుకోవడానికి, మారెట్ కార్యకలాపాలను నిర్వహించడానికి చిత్రిక దోహదపడుతుంది. డిజైన్ వైవిధ్యాన్ని ఉపయోగించటంలో చిత్రిక అగ్రగామి.
అను ఆచార్య, హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన అనుఆచార్య ‘మ్యాప్ మై జీనోమ్’ సంస్థను స్థాపించారు. ఇది మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ కంపెనీ. ప్రజలు తమ ఆరోగ్యంపై అవగాహన కలిగేలా వ్యాధి లక్షణాలు, ఔషధ ప్రతిస్పందనలు, వారసత్వ పరిస్థితులు సహా జన్యు నివేదిక, ఆరోగ్య చరిత్ర వివరాలు అందిస్తుంది.
రూప మాగంటి, హైదరాబాద్ : అట్టడుగు స్థాయిలోని గ్రామీణ మహిళా వ్యవసాయదారులకు జీవనోపాధిని సృష్టించేందుకు రూప మాగంటి ‘గ్రీన్ తత్వ’ పేరుతో సామాజిక సంస్థను స్థాపించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా రైతుల పొలాలకు జియోట్యాగింగ్ చేయటం, నేల ఆరోగ్యంపై గ్రీన్ తత్వ సహాయం చేస్తుంది.
తనూజ అబ్బూరి, హైదరాబాద్ : మహిళలు ఉద్యోగాల్లో చేరటానికి, కెరీర్లో ఎదగటానికి తనూజ అబ్బూరి ట్రాన్స్ఫర్మేషన్ స్కిల్స్ ఇండియా ప్రైవేట్ లిమిండ్ను స్థాపించారు. ఇప్పటి వరకు నాలుగు వేల మంది మహిళలకు మార్గదర్శనం చేశారు. 2025 నాటికి లక్ష మంది జీవితాలను ప్రభావితం చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.