హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు.. నిన్న టీఎస్పీఎస్సీ.. ఇప్పుడు యూనివర్సిటీలు.. వేదిక ఏదైనా అందరికి సామాజిక న్యాయం చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముందుకు వెళ్తున్నారు. బడుగు బలహీన వర్గాల నుంచి అగ్రవర్ణాల వరకు అందరికీ ఒకేరకమైన న్యాయం జరిగేలా సమతూకం పాటిస్తున్నారు. అట్టడుగుస్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగినవారు, ఉద్యమ నేపథ్యం, వృత్తి నేపథ్యం, సమర్థత అన్నింటినీ పరిశీలించి పదవులు కట్టబెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మేధావులను అత్యున్నత పదవుల్లో కూర్చోబెట్టి తమ ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్తున్నారు. తాజాగా, యూనివర్సిటీల వీసీల నియామకాల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక న్యాయం పాటించారు. రాజకీయ పదవులైనా, రాజ్యాంగ పదవులైనా.. విద్యావేత్తలైనా.. అన్ని వర్గాలనుంచి అన్వేషించి తీసుకొచ్చి పెద్దపీట వేశారు. మొన్నటికి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏడు మేయర్, చైర్మన్ పోస్టుల్లో ఐదింటిలో బీసీలను నియమించారు. అచ్చంపేట చైర్మన్ పదవి జనరల్ రిజర్వ్ అయినా.. ఒక బీసీకి ఇచ్చారు. సిద్దిపేట, వరంగల్లోనూ బీసీ మహిళలకు ఉన్నత పదవులిచ్చి గౌరవించారు. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల కూర్పులోనూ ఈ సమతౌల్యం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు వర్సిటీలకు ఉపకులపతుల నియామకంలోనూ ముఖ్యమంత్రి ఆలోచన, ప్రాధాన్యం ఏమిటన్నది అర్థమవుతున్నది.
శనివారం రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల (వీసీ)ను నియమించారు. ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్నాన్ని ఇచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వీసీగా ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ను (బీసీ), కాకతీయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ను (బీసీ) నియమించారు. పాలమూరు విశ్వవిద్యాలయానికి లక్ష్మీకాంత్ రాథోడ్ (ఎస్టీ)ను, శాతవాహన (కరీంనగర్) విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ మల్లేశం (ఎస్సీ)ను నియమించారు. కొలువుల భర్తీచేసే గురుతర బాధ్యతలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చారు. తెలంగాణ వర్సిటీకి దాచేపల్లి రవీందర్ గుప్తా (వైశ్య), అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సీతారామారావు (బ్రాహ్మణ), జేఎన్టీయూకు కట్టా నర్సింహారెడ్డి (రెడ్డి), ఎంజీయూకు గోపాల్రెడ్డి (రెడ్డి), తెలుగు యూనివర్సిటీకి కిషన్రావు (వెలమ), ఫైన్ఆర్ట్స్ వర్సిటీకి కవితా దర్యాని (సింధీ) ని నియమించారు. వర్సిటీ వీసీల నియామకాలను కేవలం రాజకీయ నియామకాలుగా ముఖ్యమంత్రి పరిగణించలేదు. సామాజిక న్యాయం పాటించడం అంటే.. కేవలం ఆయా కులాల నుంచి ఎవరినో నామమాత్రంగా ఎంపికచేయడం కాకుండా.. ఆయా వర్గాలనుంచి అత్యంత ఉన్నత చదువులు చదివి.. వివిధ అంశాలపై లోతుగా పరిశోధన చేసిన వారిని శోధించి ఎంపికచేశారు. తెలంగాణ ఉద్యమంతో మమేకమై పోరాడి.. ఇక్కడి చరిత్రతోనూ, సంస్కృతితోనూ సమ్మిళితమై.. విద్యావ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న అకుంఠిత ఆకాంక్ష కలిగిన సమున్నత వ్యక్తిత్వం కలిగిన వారిని విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా నియమించారు. ఈ పదిమంది వీసీలలో ఏ ఒక్కరూ వేలెత్తి చూపడానికి అవకాశం లేనివారే.
తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్లో అతి ముఖ్యమైన నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రాణప్రతిష్ఠగా భావిస్తున్నది. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఇంత గురుతర బాధ్యతను నెరవేర్చేందుకు ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులను, అనుభవశీలురిని ఎంపిక చేయటంతోపాటు అందులోనూ అట్టడుస్థాయి నుంచి ఎదిగి వచ్చిన వారిని జల్లెడపట్టి మరీ వెతికి టీఎస్పీఎస్సీలో నియమించింది. చైర్మన్ సహా ఏడుగురు సభ్యుల్లో ముగ్గురు బీసీలు. ఇందులో ఇద్దరు మహిళలుండటం విశేషం. ఇందులో ఒకరు ముదిరాజ్ (కోట్ల అరుణకుమారి), మరొకరు పద్మశాలి (ఆర్ సత్యనారాయణ). ఇంకొకరు ఆరె క్షత్రియ (సుమిత్రా ఆనంద్ తనోబా). మరో సభ్యుడు ఎస్టీ (ధన్సింగ్) అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించి ఈఎన్సీ హోదాలో రిటైర్ అయ్యారు.