ఆత్మకూరు, జూన్ 25 : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ వద్ద ఆదివారం సాయంత్రం కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు నడుపుతున్న ఆకర్ష్తో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన అనుముల నర్సింహాచారి, వెల్దండి సాంబరాజు తమ కుటుంబాలతో కలిసి ఒకే కారులో ఆదివారం ఉదయం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల దర్శనానికి వెళ్లారు. మొక్కులు చెల్లించుకొని తిరిగి వస్తుండగా ఆత్మకూరు-నీరుకుళ్ల క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో కారు నుజ్జనుజ్జయింది.
కారులో ప్రయాణిస్తున్న అనుముల నర్సింహాచారి(60), అతడి కూతురు వెల్దండి ఆకాంక్ష(33), అల్లుడు వెల్దండి సాంబరాజు(42), మనుమరాలు వెల్దండి లక్ష్మీప్రసన్న(9) అక్కడికక్కడే మృతిచెందారు. నర్సింహాచారి భార్య అనుముల రాజ శ్రీ(50), కూతురు అనుముల అక్షిత(25), మనుమడు వెల్దండి అక్షయ రాజు(6), కుమారుడు అనుముల ఆకర్ష్(29)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సీఐ బండారి కుమార్, ఎస్సై ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.