Karimnagar | ఇది హృదయ విదారక ఘటన. అంతు చిక్కని వ్యాధితో 45 రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు చనిపోగా, ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలోని గంగధార మండల కేంద్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. వేముల శ్రీకాంత్(34), మమతకు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. వీరికి అమూల్య(5), అద్వైత్(20 నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ వృత్తిరీత్యా ఓ ప్రయివేటు కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్నాడు. అయితే నవంబర్ నెలలో అద్వైత్కు జ్వరం వచ్చింది. దీంతో పాటు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ బాబు కోలుకోలేకపోవడంతో.. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నవంబర్ 16న అద్వైత్ ప్రాణాలు కోల్పోయాడు.
అద్వైత్ మాదిరిగానే అమూల్య కూడా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ పాప కూడా నవంబర్ 29న ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు పిల్లలు తన కళ్ల ముందే చనిపోవడంతో తల్లి మమత డిసెంబర్ 15న తీవ్ర అనారోగ్యానికి గురైంది. భార్య మమతను బతికించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమె కూడా డిసెంబర్ 17న చనిపోయింది. ఇద్దరు పిల్లలతో పాటు భార్య కూడా మృతి చెందడంతో శ్రీకాంత్ కూడా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆయన కూడా అనారోగ్యానికి గురై.. శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచాడు.
45 రోజుల్లోనే ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీరి మృతికి గల కచ్చిత కారణం తెలియరాలేదు. గంగధార పీహెచ్సీ డాక్టర్లు.. శ్రీకాంత్ ఇంటిని పరిశీలించారు. శ్రీకాంత్ తల్లిదండ్రుల రక్త నమూనాలను సేకరించారు. ఇంట్లోని నీటిని కూడా పరీక్షించారు. వాటర్ ఎలాంటి కలుషితం కాలేదని వైద్య పరీక్షల్లో తేలింది. ఇక మమత నమూనాలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నలుగురి మృతికి గల కారణాలు ఫోరెన్సిక్ రిపోర్టులోనే తేలే అవకాశం ఉందన్నారు.