హైదరాబాద్: హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు (High Court Judges) ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ రామకృష్ణా రెడ్డి, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్తో సీజే జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, లాయర్లు హాజరయ్యారు. హైకోర్టులో లాయర్లుగా ఉన్న ఈ నలుగురిని జడ్జిలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో వారి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28న ఆమోదముద్రవేశారు. దీంతో రాష్ట్ర హైకోర్టులో జడ్జిల సంఖ్య 30కి చేరింది. మొత్తం 42 మంది జడ్జిలు ఉండాలి.
వాకిటి రామకృష్ణారెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో 1970 సెప్టెంబరు 14న జన్మించారు. బీకాం, ఎల్ఎల్బీ పూర్తిచేసిన ఆయన 1997లో న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాది ఎ.అనంతారెడ్డి ఆఫీస్లో జూనియర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2005 నుంచి సొంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు, ఆ తర్వాత తెలంగాణ, ఏపీ హైకోర్టులు, సిటీసివిల్, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టుల్లో వకాలత్ చేశారు. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరఫు న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
గౌస్ మీరా మొహియుద్దీన్
హైదరాబాద్లోని బాలానగర్కు చెందిన గౌస్ మీరా మొహియుద్దీన్ 1969లో జన్మించారు. 1993లో ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్గా కొనసాగుతున్నారు.
సుద్దాల చలపతిరావు
జనగామకు చెందిన సుద్దాల చలపతిరావు 1971 జూన్ 25న జన్మించారు. ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో 1998లో న్యాయవాదిగా నమోదు చేసుకున్న ఆయన.. 2004 వరకు న్యాయవాది వై.రామారావు చాంబర్స్లో జూనియర్గా పనిచేశారు. హైకోర్టు, రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సహా పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు.
గాడి ప్రవీణ్కుమార్
1971లో నిజామాబాద్ జిల్లా భీంగల్లో జన్మించిన గాడి ప్రవీణ్ కుమార్.. కాకతీయ వర్సిటీ నుంచి లా డిగ్రీ, ఓయూ నుంచి ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. 1998లో ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, హోం, కార్మిక, ఉపాధి శాఖల తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఈడీ, ఇండియా మింట్, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం డిప్యూటీ సొలిసిటర్ జనరల్గా పనిచేస్తున్నారు.