హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) / కొత్తగూడెం క్రైం : దండకారణ్యంలో తుపాకుల మోత మోగింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి రక్తమోడింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్ మంగళవారం ధ్రువీకరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విధ్వంసాలకు పాల్పడేందుకు తెలంగాణ నుంచి పలువురు మావోయిస్టులు గడ్చిరోలి సరిహద్దులోకి ప్రవేశించారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు అడిషనల్ ఎస్పీ యతీశ్ దేశ్ముఖ్ నేతృత్వంలోని కోలమర్క అడవుల్లో సీ-60, సీఆర్పీఎఫ్ క్విక్ యాక్షన్ టీమ్స్ కూంబింగ్ నిర్వహించాయి. ఎస్పీఎస్ రేపన్పల్లి సమీపంలోని కోలమర్క కొండప్రాంతంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. పోలీసు బలగాలు దీటుగా కాల్పులు జరుపుతూ ముందుకు కదులుతుండటంతో.. మావోయిస్టులు ప్రాణరక్షణకు పారిపోయినట్లు ఎస్పీ తెలిపారు.
అనంతరం కాల్పులు జరిగిన ప్రాంతంలో సోదాలు చేయగా నలుగురు మావోయిస్టుల మృతదేహాలు దొరికినట్లు చెప్పారు. మృతుల్లో ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి పోడియం పాండు ఆలియాస్ మంగులు (32), కుమ్రంభీం మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యుడు వర్గేశ్ (28), ప్లాటూన్ సభ్యులు కుడిమెట్ట వెంకటేశ్, కుర్సంగ్ రాజు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. వీరిపై సుమారు రూ.36 లక్షల రివార్డులు ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్, కార్బైన్ రైఫిల్, రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, లైవ్ రౌండ్లు, ఇతర పేలుడు పదార్థాలు, నక్సల్ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఐజీ ఏఎన్ఏవో సందీప్ పాటిల్, గడ్చిరోలి రేంజ్ డీఐజీ అంకిత్ గోయెల్, సీఆర్పీఎఫ్ డీఐజీ (ఆపరేషన్స్) జగదీశ్ మీనా, గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్, అడిషనల్ ఎస్పీ యతీశ్ దేశ్ముఖ్, అడిషనల్ ఎస్పీ అహేరి రమశే, డీఎస్పీ విశాల్ నాగర్గోజే నేతృత్వంలో ఆపరేషన్ విజయవంతంగా కొనసాగినట్లు వెల్లడించారు.
దంతెవాడ, మార్చి 19: ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. వీరిలో ఒక మహిళ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు కిరందుల్ పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సంయుక్తంగా చేపట్టిన యాంటీ నక్సలైట్ ఆపరేషన్ సందర్భంగా ఈ ఎన్కౌంటర్ జరిగిందని జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించగా, పలువురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాలతోపాటుగా ఆయుధాలు, కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొన్నామని వెల్లడించారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపారు.